Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాలు: లాభమెవరికి.? నష్టమెవరికి?

By:  Tupaki Desk   |   24 Oct 2019 10:07 AM GMT
ఎన్నికల ఫలితాలు: లాభమెవరికి.? నష్టమెవరికి?
X
మహారాష్ట్ర , హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశమంతా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన కేవలం 5 నెలల్లోనే జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఎవరికి లాభం చేకూర్చాయి.. ఎవరికి నష్టం చేకూర్చాయి అని విశ్లేషిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఇవి షాకిచ్చే ఫలితాలే అని చెప్పకతప్పదు. ఐదు నెలల్లోనే ఏకంగా 23శాతం ఓటు బ్యాంకును బీజేపీ కోల్పోవడం అంటే మాటలు కాదు అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

మహారాష్ట్రలో చూసుకుంటే గత 2014 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏకంగా 21 సీట్ల‌ను కోల్పోయింది. 2014లో 122 వ‌స్తే, ఇప్పుడు 101కే ప‌రిమితమై పోయింది. ఇక్క‌డ శివ‌సేనది కూడా అదే ప‌రిస్థితి. 2014లో 63 వ‌స్తే ఇప్పుడు 60 ద‌గ్గ‌ర ఆగిపోయింది. ఇక ప్రతిపక్ష ఎన్సీపీ మాత్రం బాగా లాభ‌ప‌డింది. ఆ పార్టీకి 2014లో 41 వ‌స్తే... ఇప్పుడు 55 వ‌చ్చి 14 సీట్ల‌ను పెంచుకుంది ఎన్సీపీ. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఆ పార్టీ త‌న స్థానాల‌ను నిల‌బెట్టుకుంది. పోయినసారి లానే 42 సీట్లు సాధించింది

ఇక హ‌ర్యానా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీజేపీ బాగా న‌ష్ట‌పోయింది. 47 సీట్ల నుంచి 40 సీట్ల‌కు పడిపోయింది. మేజిక్ ఫిగ‌ర్‌కు ఆరు సీట్ల‌లో ఆగిపోయింది.
కాంగ్రెస్ 2014లో 15 సీట్లు వ‌స్తే... ఇప్పుడు 17 సీట్ల‌ను అధికంగా సాధించి 32 ద‌గ్గ‌రే ఆగిపోయింది. దీంతో ఏ పార్టీకి అధికారం దక్కక అక్కడ హంగ్ అనివార్యమైపోయింది. ఇక హర్యానాలో గత 2014లో 19 సీట్లను సాధించిన ఐఎన్ఎల్‌డీ బాగా న‌ష్ట‌పోయింది. 19 సీట్ల నుంచి ఒక సీటుకు ప‌డిపోయింది. ఇక జేజేపీ కేవలం 10 నెలలకిందటే స్థాపితమైన పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా ప‌ది సీట్ల‌ను సాధించి సత్తా చాటింది. ఇప్పుడు కాంగ్రెస్ తో కానీ, బీజేపీ తో కానీ జేజేపీ క‌లిస్తే వారిదే అధికారం. మేజిక్ ఫిగ‌ర్ కు కావాల్సిన సీట్లు జేజేపీ దగ్గర ఉన్నాయి. ఇక ఇత‌రులు ఏడుగురి మ‌ద్ద‌తు ఎవ‌రికి ఉంటే వారిదే అధికారం. దీంతో హంగ్ హర్యానా అసెంబ్లీలో స్వతంత్రులు, జేజేపీ కింగ్ మేకర్ లా అవతరించాయి.

అయితే 2014 ఎన్నికలతో పోల్చిచూస్తే ఈ అసెంబ్లీ ఫలితాలు ఖచ్చితంగా బీజేపీకి షాకిచ్చినట్టే. హర్యానాలో అధికారం కోల్పోగా.. మహారాష్ట్రలో కేవలం మేజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. బోటాబోటీతోనే బయటపడింది. ఏకంగా గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికి బీజేపీ పొందిన ఓట్లు ఏకంగా 23శాతం కోల్పోవడమంటే మాటలు కాదు.. బీజేపీపై ప్రజల్లో ఉన్న అభిమానం ఏ స్థాయిలో తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ ఎన్నికలు అధికార కాంక్షతో చెలరేగిపోతున్న బీజేపీ ముందరికాళ్లకు బంధం వేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఇక ఓడిపోయి కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త ఊపిరిని ఇచ్చాయి.