Begin typing your search above and press return to search.

కేంద్రం అడిగింది..ఈసీ చెప్పిందంటే..ముంద‌స్తు ఎన్నిక‌లే

By:  Tupaki Desk   |   5 Oct 2017 6:55 AM GMT
కేంద్రం అడిగింది..ఈసీ చెప్పిందంటే..ముంద‌స్తు ఎన్నిక‌లే
X
దేశంలో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైందా? జ‌మిలీ ఎన్నిక‌ల కంటే ముంద‌స్తుకే మొగ్గు చూస్తున్నారా? కేంద్రం ఇందుకు క‌స‌ర‌త్తు చేస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజాగా ఎన్నికల కమిషన్ వ్యాఖ్యల‌ను చూస్తే!ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ వో) నెట్‌ వర్క్ యాప్‌ను ఎన్నికల కమిషన్ బుధవారం ప్రారంభించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి లోక్‌ సభతోపాటు అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండగలమని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మీడియాతో మాట్లాడుతూ...``పార్లమెంట్ - అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు మీకేం కావాలని కేంద్రప్రభుత్వం అడిగింది. అందుకు జవాబుగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటు తనిఖీ యంత్రాల (వీవీపీఏటీ) కొనుగోలుకు నిధులు కోరాం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి జమిలి ఎన్నికలకు సంసిద్ధంగా ఉంటాం`` అని పేర్కొన్నారు. ముంద‌స్తు ఉంటుంద‌ని ఊహించ‌వ‌చ్చా అనే ప్ర‌శ్న‌కు క‌మిష‌న‌ర్ సూటిగా స్పందించ‌లేదు. అయితే జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగిన చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమని చెప్పారు. ఇప్పటికే వీవీపీఏటీల కోసం రూ.3,400 కోట్లు - ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు కేంద్రం అందజేసిందని చెప్పారు.

కాగా, కొద్దికాలం క్రితం జ‌రిగిన‌ కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత తొలిసారిగా కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు ప్రధాని ఇదే విష‌యాన్ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కేబినెట్ స‌మావేశం వెంటనే కేంద్రమంత్రిమండలిలోని సహాయమంత్రులతో సహా అందరు మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, 2018 డిసెంబర్‌ లో ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలిచ్చారని తెలుస్తోంది. అందుకే రానున్నఏడాది కాలంలో ప్రజలను ఆకట్టుకునేలా పనిచేయాలని, ఏది చేసినా పార్టీ ప్రయోజనాలు - గెలుపు అవకాశాలు పెంపొందించాలని మంత్రులందరికీ సూచించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వంలో సరిగా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలికి నలుగురు బ్యూరోక్రాట్లతో సహా మొత్తం 9 మందిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ - అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసూ ప్రజా బలం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.