Begin typing your search above and press return to search.

ఎన్నికల కోడ్‌ పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులు

By:  Tupaki Desk   |   4 April 2019 10:28 AM GMT
ఎన్నికల కోడ్‌ పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులు
X
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హోరు జోరందుకుంది. తెలుగు రాష్ట్రాలో ఈనెల 11న ఎన్నికలు జరగుతుండడంతో ఆయా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అంతేస్థాయిలో సోషల్‌ మీడియా ద్వారా పార్టీల శ్రేణులు రకరకాల పోస్టులు పెడుతూ ఓట్లుడుగుతున్నారు. ఈసారి తమదే ప్రభుత్వమంటూ ఆకర్షిస్తున్నారు. కామెడీ - సీరియస్‌ వీడియోలను ఫేస్‌ బుక్‌ - వాట్సాప్‌ ల ద్వారా అప్‌లోడ్‌ చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ తరుణంలో వివిధ కులాలు - వృత్తుల వారు తమకు నచ్చిన పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు లేదు. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేసినా - వారి తరుపున పోస్టులు షేర్‌ చేసినా ఉద్యోగం ఊడినట్లే..!

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికలు జరిగే నెల ముందే నోటిఫికేషన్‌ ను ఎన్నికల కమిషన్‌ జారీ చేస్తుంది. దీంతో ఎలక్షన్‌ జరిగే ప్రాంతంలో కోడ్‌ అమల్లోకి వస్తుంది. ఈ కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల తరుపున ప్రచారం గానీ, సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేసినా ఇరుకున్న పడ్డట్లే. సెక్షన్‌ 23(ఐ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వస్తారు.ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లలో - ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నవారికి ఈ సెక్షన్‌ వర్తిస్తుంది.

అలాగే ఉద్యోగం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయరారు. ఒకవేళ ఎన్నికల బరిలో ఉండాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి ముందుగానే రాజీనామా చేయాలి. కానీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పోటీ చేయవచ్చు గానీ - వారి తరుపున ఉద్యోగులు ఎలాంటి ప్రచారం చేయకూడదు. ఈ నిబంధనలన్నీ 1949 సెప్టెంబర్‌ 17నుంచే అమల్లోకి వచ్చాయి.

మరోవైపు ఎన్నికల సంఘం ఉద్యోగుల సోషల్‌ అకౌంట్లపై నిఘా ఉంచింది. వారు ఎవరి తరుపుననైనా ప్రచారం చేస్తున్నారా..? లేక ఏదైనా పార్టీకి సంబంధించిన విషయాన్ని షేర్‌ చేస్తున్నారా..? అని ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వీరిపై చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఆధారాలతో సహా వీరు పట్టుబడితో ఉద్యోగం ఊడడమే కాకుండా కటకటాల్లోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది.