Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై ఈట‌ల తీవ్ర వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   23 Jun 2021 1:30 PM GMT
కేసీఆర్ పై ఈట‌ల తీవ్ర వ్యాఖ్యలు!
X
బీజేపీలో చేరిన త‌ర్వాత టీఆర్ఎస్ పై మాట‌ల దాడిని తీవ్రం చేసిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. దూకుడు కొన‌సాగిస్తున్నారు. కేసీఆర్ ల‌క్ష్యంగా మాట‌ల ఈటెలు విసురుతున్న రాజేంద‌ర్‌.. తాజాగా.. మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ప‌రిధిలోని క‌మ‌లాపూర్ మండ‌ల కేంద్రంలో నిర్వ‌హించిన బీజేపీ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్న ఈట‌ల‌.. కేసీఆర్ ల‌క్ష్యంగా దాడిచేశారు. ఏరు దాటే వ‌ర‌కు ఓడ మ‌ల్ల‌న్న అంటార‌ని, ఏరు దాటిన త‌ర్వాత బోడ మ‌ల్ల‌న్న అనే చందంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అంతేకాదు.. డ‌బ్బుల‌ను, కుట్ర‌ల‌ను న‌మ్ముకున్న కేసీఆర్‌.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ డ‌బ్బు సంచుల‌ను న‌మ్ముకుంటే.. తాను ప్ర‌జ‌ల ప్రేమ‌నే న‌మ్ముకున్నాని అన్నారు ఈట‌ల‌. క‌డుపులో క‌త్తులు దాచుకొని వారిని హుజూరాబాద్ ప్ర‌జ‌లు స‌హించ‌రు అని అన్నారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలిచారని, కోట్లు కుమ్మ‌రించి హుజూర్ న‌గ‌ర్‌, నాగార్జున సాగ‌ర్ గెలిచార‌ని అన్న రాజేంద‌ర్‌.. హుజూరాబాద్ లో మీ కుట్ర‌లు సాగవు బిడ్డా అంటూ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ వెళ్లి కాషాయ తీర్థం పుచ్చుకొని వ‌చ్చిన త‌ర్వాత నుంచి.. కేసీఆర్ టార్గెట్ గా మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. హుజూరాబాద్ లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. మ‌రోసారి గెలుపు జెండా ఎగ‌రేయాల‌ని ఈట‌ల ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో.. ఉప ఎన్నిక‌ న‌గారా మోగ‌కుండానే.. హుజూరాబాద్ యుద్ధం కొన‌సాగుతోంది.