Begin typing your search above and press return to search.

డ్రంక్ & డ్రైవ్ : 32 వేల కేసులు ... 232 మంది మృతి !

By:  Tupaki Desk   |   26 Nov 2021 11:30 PM GMT
డ్రంక్ & డ్రైవ్ : 32 వేల కేసులు ... 232 మంది మృతి !
X
మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎన్నిసార్లు చెప్పినా.. ఎంత అవగాహన కల్పించినా మందుబాబులకు అర్థంకావడం లేదు. తాగడం తూలుతూ వాహనం నడుపుతూ ప్రమాదాలు చేయడం పరిపాటైంది. ఈ ప్రమాదాల్లో వారు గాయపడుతున్నా, ఎదుటి వాళ్ల ప్రాణాలు పోతున్నా వారి పంథా మారడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ద్విచక్రవాహనదారులే అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మోతాదుకు మించి మద్యం సేవించే వాళ్లలో 25614 మంది ద్విచక్రవాహనదారులు, 1055 ఆటో, 5947 కార్లు, 202 భారీ వాహనదారులున్నారు. వీరిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 210 ప్రమాదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 232 మంది మరణించినట్లు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో జరిగిన మొత్తం రహదారి ప్రమాదాల్లో మద్యం సేవించిన వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలు 30.7 శాతం ఉన్నాయని తెలిపారు. మృతుల సంఖ్య 31.8 శాతంగా ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 35 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా పట్టుబడుతున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిని న్యాయస్థానాల్లో హాజరుపరుస్తున్నారు. ఈ ఏడాది జులై నెల నుంచి ఆగస్టు 20 వరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 2,056 మంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి మొత్తం 1,670 చార్జ్‌షీట్‌లు నమోదు చేశారు. ముగ్గురు మందుబాబులను కోర్టు వేళలు ముగిసే వరకు నిలబడి ఉండాలని న్యాయస్థానం శిక్ష విధించింది. మరొకరి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కోర్టు, రూ.1,74,50,000 జరిమానాలు విధించింది. చిత్తుగా తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి, మద్యం తాగి వాహనాలు నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పదేపదే దొరుకుతున్న వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టి జైలుశిక్షలు పడేలా చేస్తున్నారు. అయినా చాలామంది తీరు మార్చుకోవడంలేదు. మూడేళ్లుగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు పబ్‌ల్లో ఇష్టానుసారం మద్యం తాగడం, తరువాత ఖరీదైన కార్లలో నియంత్రణ లేకుండా వేగంగా రోడ్లపై దూసుకుపోతున్నారు. ఈక్రమంలో జరుగుతున్న ప్రమాదాల్లో అనేకమంది దుర్మరణం చెందుతున్నారు.