Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ సంచలనం.. డాక్టర్ మీద చేయి వేస్తే పదేళ్లు?

By:  Tupaki Desk   |   14 Aug 2019 6:01 AM GMT
మోడీ సర్కార్ సంచలనం.. డాక్టర్ మీద చేయి వేస్తే పదేళ్లు?
X
వరుస పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ సర్కార్ తాజాగా మరో కీలకమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉందా? అంటే అవునని చెప్పాలి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగానే కాదు.. వైద్య రంగానికి ఊరటనిచ్చేలా ఉన్నాయి. ఇటీవల కాలంలో చిన్న విషయాలకే వైద్యుల మీదా.. ఆసుపత్రుల మీదా దాడులు అంతకంతకూ పెరిగిపోతున్న పరిస్థితి. ఒకట్రెండు చోట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ.. అందరి పట్ల అనుమానంగా చూడటం.. ఆగ్రహంతో రియాక్ట్ కావటం లాంటి ఉదంతాలు పెరుగుతున్నాయి.

ఇలాంటి వేళలో అనాలోచిత చర్యలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. విధుల్లో ఉన్న వైద్యుల్ని.. ఆరోగ్య నిపుణులపై దాడి చేసిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా ఒక ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్నారు. ఇందులో వైద్యులు.. వైద్య సేవా నిపుణులతో పాటు.. ఆసుపత్రుల భద్రతకు పెద్ద పీట వేసేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. వైద్యులపై దాడి చేసినా.. వారిని గాయపర్చిన వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకూ జైలుశిక్షతో పాటు రూ.2లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఫైన్ విధించేలా బిల్లులో పేర్కొననున్నారు.

ఇక.. ఆసుపత్రిపై దాడి చేసి నష్టం కలిగించిన వారికి ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకూ జైలుశిక్షతో పాటు రూ.50వేల నుంచి రూ.5లక్షల జరిమానానను విధించేలా రూల్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా తాము ప్రయారిటీ అనుకున్న అంశాలపై యుద్ధ ప్రాతిపదికన బిల్లును చట్టరూపంలోకి తీసుకొస్తున్న మోడీ సర్కారు.. వైద్యులపై దాడుల్ని నిరోధించే తాజా బిల్లును చట్టంగా మార్చేందుకు ఎంత వేగంగా పని చేస్తారో చూడాలి.