Begin typing your search above and press return to search.

కశ్మీర్ ఇష్యూ.. మళ్లీ నాలుక మడతేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   10 Sept 2019 11:40 AM IST
కశ్మీర్ ఇష్యూ.. మళ్లీ నాలుక మడతేసిన ట్రంప్
X
కుక్క తోక వంకర అన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కశ్మీర్ వివాదంపై మాట్లాడి మరోసారి తేనెతుట్టెను కదిపారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ కశ్మీర్ విషయంలో మరోసారి తలదూర్చాడు. భారత్ కు కశ్మీర్ అంశంలో సాయం చేస్తామని.. ఆ ఆఫర్ ఏంటో భారత్ కు తెలుసు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

జూలైలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిశాడు. అప్పుడు కశ్మీర్ విషయంలో భారత్, పాక్ ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ నోరుజారాడు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక ఇటీవలే జీ7 దేశాల సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటి అయిన ప్రధాని మోడీ చర్చల మేరకు కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. దీనిలో జోక్యం చేసుకోమని ట్రంప్ తేల్చిపారేశాడు.

దీంతో కశ్మీర్ విషయంలో అమెరికా తలదూర్చదని తెలుసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్.. కశ్మీర్ విషయంలో అణుయుద్ధానికైనా సిద్ధమని ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ట్రంప్ నాలుక మడతేశాడు. వైట్ హౌస్ లో మీడియాలో మాట్లాడిన ట్రంప్ కశ్మీర్ విషయంలో మళ్లీ పాత పాటే పాడారు. భారత్ లో అంతర్భాగమైన కశ్మీర్ అంశంలో భారత్ కు ఆఫర్ ఇస్తున్నానంటూ జోక్యం చేసుకోవడం దుమారం రేపింది. దీనిపై భారత్ ఆగ్రహంగా ఉంది. మొన్ననే జోక్యం చేసుకోలేమని చెప్పిన ట్రంప్ మళ్లీ కశ్మీర్ విషయంలో పాత పాటేపాడడంపై భారత్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.