Begin typing your search above and press return to search.

ప్రతిపక్షాలను మోడీ గౌరవిస్తున్నారా?

By:  Tupaki Desk   |   26 July 2022 5:46 AM GMT
ప్రతిపక్షాలను మోడీ గౌరవిస్తున్నారా?
X
నరేంద్ర మోడీ వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. తాను మాత్రం ప్రతిపక్షాలను ఏ దశలోను గౌరవించరు కానీ ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటున్నారు. ఒక కార్యక్రమంలో మోడీ వర్చువల్ గా మాట్లాడుతు కేంద్రం చేయాలని అనుకుంటున్న అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నట్లు ఆరోపించారు. దేశ ప్రయోజనాలకన్నా ప్రతిపక్షాలకు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువంటు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయ్ చేసిన 'ప్రజాస్వామ్యం కారణంగా దేశంలో పార్టీలు ఉనికిలో ఉన్నాయి' వ్యాఖ్యలను గుర్తుచేశారు.

అంటే మోడీ వ్యాఖ్యలను చూస్తుంటే ప్రతిపక్షాలు దేశంలో ఉండకూడదన్న పద్దతిని అవలంభిస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను బీజేపీ నిర్వీర్యం చేసేస్తున్న విషయాన్ని అందరు చూస్తున్నదే.

ఇక 1971 లో పాకిస్ధాన్ తో జరిగిన యుద్ధంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డాయట. తొలి అణుపరీక్ష నిర్వహించినపుడు కూడా ప్రధాన పార్టీలన్నీ అప్పటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం అణచివేతకు వ్యతిరేకంగా ప్రధానపార్టీలన్నీ ఏకమైన విషయాన్ని తెలిపారు.

అంతా బాగానే ఉందికానీ ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నపుడు మరి ప్రతిపక్షాలకు తాను ఎంత విలువిస్తున్నారు ? ఎదుటివారి నుంచి గౌరవాన్ని కోరుకునే వారు ముందుగా తాము ఎదుటివారిని గౌరవించాలన్న సూత్రాన్ని మోడీ మరచిపోతున్నారు. విదేశాలకు వెళ్ళినపుడు కాంగ్రెస్ పార్టీపై ఎంతటి బురదచల్లారో అందరు చూసిందే. అందుకనే మోడీపై కాంగ్రెస్ అదేపద్దతిలో రెచ్చిపోతోంది.

ఇక గడచిన ఎనిమిదేళ్ళల్లో జరిగిన విషయాలను వదిలేస్తే మొన్నటికొమొన్న రాష్ట్రపతిగా పనిచేసిన రామ్ నాధ్ కోవంద్ కు మోడీ వీడ్కోలు విందిచ్చారు. ఆ విందుకు కేసీయార్, కేరళ లాంటి కొందరు ముఖ్యమంత్రులను కావాలనే మోడీ పిలవలేదు.

రామనాధ్ విందుకు అందరు ముఖ్యమంత్రులను తాను ఎందుకు పిలవలేదో మోడీ సమాధానం చెప్పగలరా ? ప్రతిపక్షాల విషయంలో మోడీ తన దృక్పదాన్ని మార్చుకుంటే ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వం విషయంలో వైఖరిని మార్చుకుంటాయి.