Begin typing your search above and press return to search.

అశ్వత్థామరెడ్డి స్టీరింగ్ పడతారా.. సెలవు పెడతారా?

By:  Tupaki Desk   |   30 Nov 2019 6:32 AM GMT
అశ్వత్థామరెడ్డి స్టీరింగ్ పడతారా.. సెలవు పెడతారా?
X
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆయన కూడా విధుల్లో చేరి పని చేసుకోవాల్సిందేనని... డ్యూటీల నుంచి మినహాయింపులేమీ ఉండవని స్పష్టం చేసింది. నిజానికి గతంలో ఆర్టీసీ యూనియన్ నాయకులకు డ్యూటీల నుంచి మినహాయింపు ఉంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో యూనియన్ నాయకులకు మినహాయింపులను ఎత్తివేశారు. ఆర్టీసీ కార్మిక నేతలు కూడా సాధారణ కార్మికుల తరహాలోనే డ్యూటీ చేయాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసింది. డ్యూటీ రిలీఫ్ హక్కులను రద్దు చేసింది. దీంతో ఉద్యోగం పరంగా ఆర్టీసీ డ్రైవర్ అయిన ఆయన ఇకపై మళ్లీ డ్రైవరు విధులు నిర్వర్తించాల్సిందేనని యాజమాన్యం చెప్పింది.

కార్మిక నేతలు కూడా ఇతర కార్మికుల తరహాలోనే డ్యూటీకి హాజరుకావాలని, లేనిపక్షంలో సెలవు పెట్టివెళ్లిపోవాల్సి ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 30 మంది కార్మిక నేతలకు డ్యూటీ మినహాయింపు ఉంది. దాంతో వారు విధులు నిర్వహించకుండా యూనియన్ పనుల మీద తిరుగుతున్నారు. మరోవైపు అధికారిక కార్మిక సంఘమైన టీఎంయూకు కేటాయించిన కార్యాలయాలకు ఆర్టీసీ యాజమాన్యం తాళాలు వేసింది. కార్మిక సంఘాల కోసం కార్మికుల నుంచి సభ్యత్వ రుసుము వసూలును కూడా యాజమాన్యం నిలిపివేసింది.

తమకు డ్యూటీ మినహాయింపు ఎత్తివేయడంపై అశ్వత్ధామరెడ్డి స్పందించారు. ప్రభుత్వానిది చిల్లర చర్య అని అన్నారు. తాను ఉద్యోగపరంగా డ్రైవరునని, బస్సు నడపడానికి తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కావాలనుకుంటే సెలవు పెడతానని చెప్పారు. ఆర్టీసీలో యూనియన్లు ఉండాలా వద్దా అన్న దానిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారులు ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని, వెంటనే కార్మిక సంఘాల యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. యూనియన్లు ఉండాలా వద్దా అనేది లేబర్ కోర్టు నిర్ణయిస్తుందని అన్నారు. యూనియన్ నేతలకు చట్ట ప్రకారం కొన్ని మినహాయింపులు ఉంటాయని అన్నారు.