Begin typing your search above and press return to search.

గాంధీలో రోగుల జాతరతోనే ఇన్ని ఇబ్బందులా?

By:  Tupaki Desk   |   12 Jun 2020 3:30 AM GMT
గాంధీలో రోగుల జాతరతోనే ఇన్ని ఇబ్బందులా?
X
మొన్న జర్నలిస్ట్ మనోజ్ మరణం.. తెలంగాణలో కరోనా వైరస్ కు చికిత్స కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో లొసుగులను ఎత్తిచూపింది. ఆస్పత్రి నిర్వహణ ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టింది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కరోనా సోకిన వారిని ఇక్కడికే తరలిస్తున్నారు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందిలో ఓపిక నశిస్తోంది. మరోవైపు రోగుల బంధువుల దాడులతో పరిస్థితి దిగజారుతోంది. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో పరిస్థితులు చేజారి పట్టించుకోకుండా ఉండడంతో మరణాలు సంభవిస్తున్నాయి.

రోగులకు సమయానుకూలంగా ఆహారాన్ని అందించకపోవడం..దానికి తోడు వైద్యులు రోగి ఆరోగ్యస్థితిని పరిశీలించడంలో జాప్యం కావడంతో రోగుల బంధువులు దాడులు గొడవలకు దిగుతున్నారు. దీంతో గాంధీ వైద్యులు ధర్నా చేపట్టే స్థాయికి పరిస్థితి దిగజారింది.

గాంధీ ఆస్పత్రి సామర్థ్యం కేవలం 1000 రోగులు మాత్రమే. అయితే కరోనా చికిత్సాలయంగా మార్చిన తెలంగాణ సర్కార్ 1850 మంది సామర్థ్యానికి పెంచింది. కానీ ఆ మేరకు వైద్య సిబ్బందిని, డాక్టర్లను పెంచలేదు. కేవలం 450 మంది డాక్టర్లు, హౌస్ సర్జన్లు మాత్రమే సేవలందిస్తున్నారు. ఇక వీరిని మూడు విభాగాలుగా చేసి వారం ఒకరిని రప్పిస్తూ మిగతా వారిని క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

తెలంగాణలో కేసుల సంఖ్య భారీగా పెరగడం.. 4వేలకు పైగా నమోదు కావడం.. వేలల్లో రోగులు గాంధీకి చేరడం వల్ల వారికి వైద్య సేవలు కష్టమవుతోంది. ఇక రోగులకు అందించాల్సిన సౌకర్యాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నర్సులు, వార్డ్ బాయ్ లు తక్కువగా ఉండడంతో రోగుల ఆలనాపాలనా కరువవుతోంది. ఆహారం, మందుల పంపిణీలో జాప్యం జరుగుతోంది.

తొలి 100 కేసులు నమోదైనప్పుడు గాంధీలో అత్యంత మెరుగైన సేవలు అందించారు. కానీ రోగుల సంఖ్య పెరగడంతో సేవలందించే వైద్యులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో సేవలు అందక అస్తవ్యస్తంగా మారింది. అవిశ్రాంతంగా గాంధీలో పనిచేస్తున్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. అవే ఈ గందరగోళ పరిస్థితికి కారణమవుతున్నాయి.