Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి సీటు ఎలా వచ్చిందో తెలుసా?

By:  Tupaki Desk   |   24 March 2021 10:37 AM GMT
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి సీటు ఎలా వచ్చిందో తెలుసా?
X
ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నికపైనే ఉంది. మొన్న జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఊపులో ఉన్న వైసీపీ తిరుపతిని చేజిక్కించుకునేందు రకరకాల వ్యూహాలు పన్నుతోంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా గురుమూర్తి పేరును ప్రకటించి విషయం తెలిసిందే. అయితే పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న గురుమూర్తిని జగన్ ఎంపిక చేయడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఫిజియోథెరపిస్టు అయిన గురుమూర్తి జగన్ కు సేవ చేసినందుకు టికెట్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే అంతకన్న పెద్ద విషయం మరోటి ఉందని ఏపీ పొలిటికల్లో హాట్ గా చర్చ సాగుతోంది.

2019లో జరిగిన తిరుపతి ఎంపీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఎంపీగా బల్లి దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన హఠాన్మరణం చెందారు. ఆ తరువాత ఆయన కుమారుడికే ఇక్కడి సీటు ఇస్తారని అనుకున్నారు. అయితే దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. దీంతో ఆయన కూమారుడు ఎంపీ సీటుపై ఎలాంటి ఆశ పెట్టుకోలేదు. అయితే గత కొన్ని నెలల కిందట తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో చర్చలు జరిపిన జగన్... గురుమూర్తి పేరును తెరపైకి తీసుకువచ్చారు. కొన్ని రోజుల కింద అధికారికంగా ప్రకటించారు.

వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు పాదయాత్ర చేసిన విషయం తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఫిజియోథెరఫిస్ట్ గురుమూర్తి.. చెల్లెలు షర్మిలకు వైద్యుడిగా ఉన్నారు. ఆ తరువాత జగన్ కు కూడా వైద్యం అందించారు. ఆయన చేసిన సేవలకు వైద్య రంగంలో ఏదో ఒక పదోన్నతి కల్పించాలని భావించారు. ఇంతలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ తరుణంలో పార్లమెంట్ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. తాము లేనిదే ఇక్కడ వైసీపీ గెలవదని, తమతోనే పార్టీ డెవలప్ అయిందని అనుకున్నారట. అంతేకాకుండా తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద డిమాండ్ చేయాలని అనుకున్నారట.

ఇంటలీజెన్స్ వర్గాల ద్వారా జగన్ కు ఈ సమాచారం చేరుకోవడంతో జగన్ అప్రమత్తమయ్యారట. అప్పటికే జగన్ మనసులో ఉన్న గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. అయితే జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా ఓ సమావేశం ఏర్పాటు చేసిన జగన్ గురుమూర్తి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారట. దీంతో తిరుపతి పరిధిలోని ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయట. మరి గురుమూర్తిని గెలిపించేందుకు ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తారో చూడాలి..