Begin typing your search above and press return to search.

రీశైలం ప్రాజెక్టు మీద కేసీఆర్ తాజా వాదన ఇదే

By:  Tupaki Desk   |   5 July 2021 9:42 AM GMT
రీశైలం ప్రాజెక్టు మీద కేసీఆర్ తాజా వాదన ఇదే
X
న్యాయం చెప్పే స్థానంలో ఉన్న న్యాయమూర్తికి విశాలమైన మనసు.. గుండె ఉండాలి. తప్పును తప్పుగా చూసే సత్తాతో పాటు.. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ప్రాంతాలు.. కులాలు.. మతాలకు సంబంధం లేకుండా న్యాయదేవత ఎలాంటి దురుద్దేశాలు అపాదించకుండా ఉండేలా తీర్పులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతటి గురుతర బాధ్యత ఉంది కాబట్టే న్యాయస్థానాలకు ఇచ్చే విలువ.. గౌరవం.. మరే ఇతర వ్యవస్థలకు లేదనే చెప్పాలి. ప్రజాస్వామ్యంలోని కీలక వ్యవస్థల్లో శాసన వ్యవస్థది పైచేయి అయినప్పటికీ.. లెక్క తేడా వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థకు ఉండే అధికారం అనూహ్యమన్నది తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రాజకీయ అధినేత మాత్రమే. ఆయన ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. అలాంటి వేళలో ఆయన అందరి ప్రయోజనాల్ని పరిరక్షించే కన్నా.. తాను.. తన ప్రజలు.. తన ప్రాంతానికే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల తెర మీదకు వచ్చినా అనే కంటే.. కేసీఆర్ తీసుకొచ్చిన జల వివాదానికి సంబంధించిన ఆయన చేసే వ్యాఖ్యలు.. వినిపించే వాదనలు సిత్రవిచిత్రంగా ఉంటాయి. విన్నంతనే బ్రాహ్మండం బద్ధలు అయ్యేట్లు ఉన్నప్పటికీ.. లోతుల్లోకి వెళ్లి చూస్తే మాత్రం డొల్లతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు తనదైన భాష్యం చెప్పి.. తాను అనుకున్నది.. తాను చెప్పిందే నిజమని నమ్మించేందుకు ఆయన చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదు. శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుత్ ప్రాజెక్టుగా అభివర్ణించటానికి కారణం.. ఏపీ దాని నీటిని సాగు.. తాగునీటి కోసం వాడుతున్నామని చెప్పటమే. నిజంగానే వాడరా? అంటే.. ఏపీలోని పలు జిల్లాలతో పాటు.. తమిళనాడు కూడా ఆ నీటిని వాడుతున్న వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు.

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. తమ మీద ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనలో పస లేదని.. నిబంధనల మేరకే తాను విద్యుదుత్పత్తి చేస్తున్నట్లుగా కేసీఆర్ వినిపిస్తున్న వాదనలో మొండితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందనన మాట బలంగా వినిపిస్తోంది. కృష్ణా బోర్డుకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్న అంశాల్ని వింటే.. ఇంతలా తొండి వాదనను వినిపిస్తారా? అని పలువురు విమర్శిస్తున్నారు. ఇంతకూ ఆయన పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూస్తే..

- శైలం ప్రాజెక్టును జల విద్యుత్తు కోసమే నిర్మించారని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1లోని 104వ పేజీలో కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా శ్రీశైలం నీటిని ఇతర బేసిన్‌ లోకి తరలించ లేదు. 1990-91 నుంచి 2019-20 దాకా ఏ నెలలోనూ 834 అడుగుల పైన శ్రీశైలం నీటిని నిల్వ చేసిన దాఖలాలు లేవు.

- ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచి.. ఆ నీటిని ఇతర బేసిన్‌లోకి తరలించడానికి ప్రయత్నిస్తోంది. 2013 దాకా శ్రీశైలం లో 760 అడుగులకు చేరే వరకు కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని తరలించారు.ఏపీ ప్రభుత్వానికి సాగర్‌, కృష్ణా డెల్టాల ప్రయోజనాలు అక్కర్లేదు. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 తీర్పునకు విరుద్ధంగా ఈ నీటిని ఇతర బేసిన్‌ లకు తరలించే యత్నాలు చేస్తోంది. దీంతో సాగర్‌ పై ఆధారపడిన ప్రజలకు తీవ్ర నష్టం కలగనుంది.

- 1976, 77ల్లో మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 15 టీఎంసీల కృష్ణా జలాలను చెన్నై తాగునీటి అవసరాలకు జూలై-అక్టోబరు మధ్య రోజుకు 1,500 క్యూసెక్కులకు మించి తరలించడానికి వీల్లేదు. శ్రీశైలం కుడికాలువ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ప్రకారం కూడా చెన్నై తాగునీటి అవ సరాలకు 1,500 క్యూసెక్కులు, కుడికాలువకు 750 టీఎంసీ లు మాత్రమే తరలించాల్సి ఉంది. అది కూడా శ్రీశైలంలో 854 అడుగుల పైన ఉంటేనే తరలించాలి.

- ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 12వ షెడ్యూల్‌లో సెక్షన్‌-1 ప్రకారం విద్యుత్కేంద్రాలు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. నిబంధనల మేరకే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 తీర్పును అనుసరించి సాగర్‌లో నీటి నిల్వలను పెంచడానికి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. దీనిపై ఏపీ ఆరోపణలు నిరాధారం.