Begin typing your search above and press return to search.

చైనా స్పాన్సర్లు మనకి అవసరమా .... హర్భజన్

By:  Tupaki Desk   |   21 Jun 2020 1:30 PM GMT
చైనా స్పాన్సర్లు మనకి అవసరమా  .... హర్భజన్
X
చైనా వస్తువులను బహిష్కరించాలని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పిలుపునిచ్చాడు. గల్వాన్‌ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు మరణించడంపై దేశంలో చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ హర్భజన్ స్పందించాడు. భారత్‌ పై దాడులకు తెగబడుతున్న చైనా మన డబ్బుతో ముందుకు సాగకూడదు అని , అందుకే ఆ దేశ వస్తువుల వాడకాన్ని బహిష్కరించాలని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

చైనా వస్తువులను సెలబ్రిటీలు ఆమోదిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయన్న హర్భజన్ అలాంటి వారి జాబితాలో మాత్రం తానులేనని స్పష్టం చేశాడు. స్వయం సమృద్ధిని సాధించాలంటే చైనా ఉత్పత్తులను బాయ్‌ కాట్‌ చేయడమే మంచిది. వాళ్ల దేశాన్ని మన సొమ్ముతో ఎలా నడుపుతారు చైనా వస్తువులను బాయ్‌ కాట్‌ చేసే వారితో నేనూ ఉంటా. నాకు ఎలాంటి చైనా ఎండార్స్‌మెంట్లు లేవు అని హర్భజన్‌ చెప్పాడు. ఐపీఎల్‌ స్పాన్షర్‌షిప్‌ ఒప్పందాలపై చర్చించేందుకు వచ్చే వారంలో సమావేశం కానున్నట్టు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ అంశంపైనా భజ్జీ స్పందించాడు.

ఐపీఎల్‌ ప్రమోషన్స్ కి ఏ బ్రాండూ అవసరం లేదనీ..అదే ఒక పెద్ద బ్రాండ్‌ అన్నాడు. చైనా స్పాన్షర్లు లేకపోతే ఇంకా చాలా కంపేనీలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఐపీఎలే ఒక పెద్ద బ్రాండ్‌. దానికి ఎటువంటి ప్రచారం అవసరం లేదు. అలాంటప్పుడు చైనా స్పాన్సర్లు మనకి ఎందుకు వీళ్లు కాకపోతే, ఇంకొకరు వస్తారు అని అన్నాడు. ఐపీఎల్‌ స్పాన్సర్‌ గా ఉన్న చైనా సెల్ ‌ఫోన్ల తయారీ సంస్థ వివోతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే నేపథ్యంలో భజ్జీ చెప్పుకొచ్చాడు.

ఈ చైనా దాష్టికానికి బుద్ది చెప్పాలని భారత ప్రజలు భావిస్తున్న నేపథ్యంతో చైనీస్ స్పోర్ట్స్ పరికరాల ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహ్తా గురువారం స్పష్టం చేశారు. బీసీసీఐ మాత్రం ప్రజల భావోద్వేగాలతో చైనా కంపెనీల ఒప్పందాలపై నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఇక భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను చైనా కంపెనీ అయిన వివో స్పాన్సర్‌షిప్‌ చేస్తోంది. మరోవైపు టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఇటీవలి వరకు మరో చైనా కంపెనీ అయిన ‘ఒప్పో' వ్యవహరించగా... ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సమాధానమిచ్చారు. ‘వివో' వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు.