Begin typing your search above and press return to search.

రాహూల్ గ్యారెంటీని రైతులు నమ్ముతారా ?

By:  Tupaki Desk   |   7 May 2022 11:34 AM GMT
రాహూల్ గ్యారెంటీని రైతులు నమ్ముతారా ?
X
హనుమకొండ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని రైతులు నమ్ముతారా ? ఇపుడిదే చర్చ మొదలైంది. హనుమకొండ సభలో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పైగా తానిస్తున్నది వరంగల్ డిక్లరేషన్ ప్రకటన కాదని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీగా చెప్పారు. రాహుల్ గ్యారెంటీని రైతులు నమ్మితే పార్టీకి ఉపయోగం ఉంటుందనే అనుకోవాలి.

ఎందుకంటే గతంలో కూడా అంటే 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతులకు సంబంధించి విద్యుత్ బకాయిల మాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేశారు. దాంతో ప్రతి రైతుకు వేలు, లక్షల రూపాయల ప్రయోజనం జరిగింది.

2009 ఎన్నికల సమయంలో వైఎస్ ప్రత్యేకించి హామీలేమీ ఇవ్వలేదు. అయినా రెండోసారి కాంగ్రెస్ గెలవటం, వెంటనే వైఎస్సార్ చనిపోవటం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో రాష్ట్ర విభజన జరగటం అందరికీ తెలిసిందే.

అప్పటినుండి కాంగ్రెస్ ప్రతి పక్షానికే పరిమితమైపోయింది. కాంగ్రెస్ నేతల హామీలను జనాలు నమ్మటం లేదు. ఇదే సందర్భంలో 8 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది.

రేవంత్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిన మాట వాస్తవమే. రేవంత్ పార్టీ చీఫ్ అయిన తర్వాత రాహుల్ తెలంగాణాకు రావటం ఇదే మొదటిసారి. ఈ నేపధ్యంలోనే రాహుల్ అగ్రనేత కాబట్టి ఇచ్చిన హామీని రైతులు నమ్మే అవకాశముంది.

రైతులు గనుక రాహుల్ హామీని నమ్మితే ఓట్లు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే తెలంగాణా వ్యాప్తంగా రైతాంగమే ఎక్కువున్నారు. కాకపోతే ఎప్పటినుండో కాంగ్రెస్ లో కేసీయార్ కోవర్టులున్నారనే విషయం ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రేవంత్ బహిరంగంగానే ప్రస్తావించారు. రేపటి ఎన్నికల్లో నేతలంతా ఒక్కతాటిపైన నిలిచి, అభ్యర్ధుల ఎంపికలో తప్పులు చేయకుండా టీమ్ వర్కు చేసుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశముంది. మరి కాంగ్రెస్ నేతలు ఏమి చేస్తారో చూడాలి.