Begin typing your search above and press return to search.

జలవనరుల మంత్రికి చెందిన 500 కోట్లు జప్తు

By:  Tupaki Desk   |   29 April 2019 7:47 AM GMT
జలవనరుల మంత్రికి చెందిన 500 కోట్లు జప్తు
X
కర్నాటకలో ప్రభుత్వం ఏ క్షణంలో కూలిపోతుందో అర్థం కాని పరిస్థితి. అసలు ఇది ఎన్నికల టైమ్ కావడంతో.. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా - కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటినుంచి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమికి ముప్పతిప్పులు పెట్టేందుకు బీజేపీ చెయ్యని ప్రయత్నాలు లేవు. తాజాగా.. కాంగ్రెస్ నేత - జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ పై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మంత్రి డి.కె.శివకుమార్‌ కు చెందిన రూ.500 కోట్ల విలువైన బినామీ ఆస్తిని ఐటి అధికారులు జప్తు చేశారు. మరో 20 ఎకరాల భూమి కొనుగోళ్ళకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని మంత్రి తల్లి గౌరమ్మకు ఐటి అధికారులు శనివారం నోటీసు జారీ చేశారు.

జప్తు చేసిన ఆస్తిని శోభా డెవలెపర్స్‌ తో మంత్రి డి.కె.శివకుమార్‌ - ఆయన తల్లి గౌరమ్మలు ఉమ్మడిగా ఒప్పందం చేసుకున్నారు. అభివృద్ధి చేశాక గౌరమ్మ వాటాగా రూ.235 కోట్ల విలువైన ఆస్తి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ట్రిబ్యునల్‌ కు ఐటి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే మార్కెట్‌ విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. శివకుమార్ కు చెందిన పలు బినామీ ఆస్తులను కూడా ఐటి శాఖ పరిశీలన చేసింది.

కర్నాటకలోనే బాగా డబ్బున్న నేతగా పేరొందిన డేకే శివకుమార్ కాంగ్రెస్ లో చాలా కీలక నేత. మొన్నటికి మొన్న ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు చేజారకుండా హైదరాబాద్ తీసుకురావడం - వారంతా క్షేమంగా అసెంబ్లీకి వెళ్లడం.. దీని వెనుక స్కెచ్ మొత్తం శివకుమార్ దే. అదీగాక.. కర్నాటకలోనే బాగా డబ్బున్న మంత్రిగా శివకుమార్ కు పేరుంది. దీంతో.. ఇప్పుడు శివకుమార్ ని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం... ఐటీ దాడులతో బెదిరింపులకు దిగుతుందని ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపిస్తున్నారు.