Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ రెబెల్స్ డీల్‌...ఉప‌సంహ‌రించుకుంటే కోట్లు

By:  Tupaki Desk   |   20 Nov 2018 4:13 AM GMT
కాంగ్రెస్ రెబెల్స్ డీల్‌...ఉప‌సంహ‌రించుకుంటే కోట్లు
X
రెబెల్స్.. స్వతంత్రులు.. అధికారిక అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కష్టపడి పార్టీ టికెట్ దక్కించుకున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. టికెట్ల కేటాయింపు కొట్లాటలు తారాస్థాయి చేరడం - ఎవరో ఒక్కరికే టికెట్ దక్కడం సర్వసాధారణం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. టికెట్ వచ్చిన వారు సంతోషంతో బరిలో నిలుస్తుండగా - టికెట్లు రాని వారు స్వతంత్రులుగా - రెబెల్స్‌ గా బరిలో దిగేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. వీరు బరిలో ఉంటే తమకు నష్టమా.. లాభమా అని ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. సమరానికి ఘడియలు దగ్గర పడుతుండడంతో బుజ్జగింపులకు దిగుతున్నారు. అసమ్మతి నేతలు దారిలోకి రావడమేకాక కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని ఉద్భోదిస్తున్నారు. టికెట్‌ దక్కని వారికి పార్టీ అధికారంలోని రాగానే సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో నేతలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో కోట్లు ఎర‌వేస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే, కాంగ్రెస్ పార్టీలో ఈ బుజ్జ‌గింపుల ప‌ర్వానికి కోట్లు ఖ‌ర్చ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. కర్ణాటక - పుదుచ్చేరి రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండటంతో ఆ రాష్ట్రాలకు చెందిన నేతల ద్వారా అసమ్మతులను బుజ్జగిస్తున్నారు. నామినేషన్ల గడువు ముగియనుండటంతో రెబల్స్‌ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కర్ణాటక మంత్రి డికె శివకుమార్‌ - పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి - ఆ రాష్ట్ర వైద్య మంత్రి మల్లాడి కష్ణారావులతో కూడిన బృందం బుజ్జగిస్తున్నది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నాయకులను డీల్‌ చేయడంలో డీకే శివకుమార్‌ అందెవేసిన చేయి కావడంతో ఆయన నుంచి ఏదో ఒక మంచి ఆఫర్‌ వస్తుందన్న ఆశలు రెబెల్స్‌ లో పెరిగాయి. రెండు అంశాలను ప్రధానంగా రెబెల్స్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటేడ్‌ పదవుల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామన్న హామీ మొద‌టిది కాగా - రెబెల్స్‌గా ఉపసంహరించుకునే 'మంచి ఆఫర్‌'. ఏదీ కావాలో తెల్చుకోవాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే, తొలి హామీపై సంతృప్తిగా లేర‌ని స‌మాచారం. అధికారం వచ్చేదెంతో - రానిదెంతో ఇప్పటి వరకు తాము పెట్టిన ఖర్చు రాబట్టుకునేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. అయితే నామినేషన్లు ఉపసంహరించుకున్న తర్వాత మంచి ఆఫర్‌ లేకపోతే ఏమీ ఉండదని మెలిక పెడుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు హాజరైన అసమ్మతి నేతల్లో ఎక్కువ మంది మంచి ఆఫర్‌ కోసమే తాపత్రయ పడుతున్నట్టు స‌మాచారం.

కర్ణాటక - పుదుచ్చేరి రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండటంతో ఆ రాష్ట్రాలకు చెందిన నేతల ద్వారా అసమ్మతులను బుజ్జగిస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టులపై వీరు హామీలిచ్చినా...కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో ఎవరు కీలకమవుతారో - ఎవరి మాట ఎవరు వింటారో తెలియదు. అప్పుడు పదవి పదవి కావాలంటే కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి మంత్రి డీకే శివకుమార్‌ వద్దకు వెళ్లాల్సిందేనా - ఇత్యాది ప్రశ్నలు వారి తొలిచి వేస్తున్నాయి. గెలుపు అవకాశాలు ఉన్నా...తమను కాదని వేరొకరి టికెట్‌ ఇచ్చి - అధికారం వచ్చాక పదవులిస్తామంటే నమ్మేదెలా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకే ఎక్కువ మంది సిద్ధపడుతున్నారని, దీంతో ఉప‌సంహ‌ర‌ణ‌కు కోట్ల డీల్ కొన‌సాగుతోంద‌ని స‌మాచారం. అయితే నామినేషన్లు ఉపసంహరించుకున్నాక....ఎవరి ఎక్కడ సంప్రదించాలో ముందే డిసైడ్‌ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత - పీసీసీ ముఖ్య‌నేత‌కు అత్యంత సన్నిహిత వ్యక్తికి ఈ బాధ్యతను అప్పగించినట్టు తెలిసింది.