Begin typing your search above and press return to search.

సుప్రీం బ్యాన్ ను ఢిల్లీ కేర్ చేయ‌లేదు

By:  Tupaki Desk   |   20 Oct 2017 6:15 AM GMT
సుప్రీం బ్యాన్ ను ఢిల్లీ కేర్ చేయ‌లేదు
X
అంతా నా ఇష్టం.....అంతా నా ఇష్టం....ఎడాపెడా ఏమి చేసినా అడిగేదెవ‌డ్రా నా ఇష్టం.....అన్న‌ట్లుంది ఢిల్లీ - నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్ సీ ఆర్) ప్రాంత ప్ర‌జ‌ల వ్య‌వ‌హార శైలి. ఆ ప్రాంతాల‌లో బాణాసంచాల అమ్మ‌కాల‌పై సుప్రీం విధించిన నిషేధాన్ని ఆ ప్రాంత వాసులు తుంగ‌లో తొక్కారు. మీ ఆదేశాలు మీవి ...మా ఆనందాలు మావి అన్న‌ట్లు బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించారు. గురువారం సాయంత్రం మొద‌లుకొని అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఇష్టా రీతిగా బాణా సంచా పేల్చారు. వాయు కాలుష్యంతో పాటు శ‌బ్ద కాలుష్యాన్ని కూడా క‌లిగించారు. నానాటికీ పెరిగిపోతోన్న కాలుష్యాన్ని నివారించేందుకు ఆ ప్రాంతాల‌లో బాణా సంచా అమ్మ‌కాల‌పై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని బేఖాత‌రు చేశారు. ఈ సంవత్సరం టపాకాయల విక్రయాల‌ను సుప్రీంకోర్టు నిషేధించినప్పటికీ, ప్రజలు విచ్చ‌ల‌విడిగా బాణా సంచా కాల్చ‌డం గ‌మ‌నార్హం. బాణా సంచా ధాటికి సాధార‌ణ కాలుష్య స్థాయిల కంటే 10 రెట్లు అధికంగా రీడింగులు న‌మోద‌య్యాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో, శుక్ర‌వారం ఉద‌యానికి ఆ ప్రాంతాల‌ను పొగ దుప్ప‌టి క‌ప్పేసింది. చలికాలాన్ని త‌ల‌పిస్తూ పొగ‌మంచు త‌ర‌హాలో పొగ అలుముకుంది.

సుప్రీం నిషేధాజ్ఞ‌లు ఉండ‌డంతో నేషనల్ కాపిటల్ రీజియన్ లో బహిరంగంగా బాణాసంచా అమ్మకాలు జ‌ర‌గ‌లేదు. అయితే, అనధికారికంగా వీధివీధినా విచ్చ‌ల‌విడిగా అమ్మకాలు జ‌రిగాయి. కొంత‌మంది బ‌య‌ట కాకుండా ఆన్ లైన్ లో ట‌పాసుల‌ను ఆర్డ‌ర్ చేశారు. పలు సంస్థలు - ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ గురువారం నాటి కాలుష్య గణాంకాలను వెల్ల‌డించాయి. SAFAR (సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్) ప్రకారం, PM2.5 మరియు PM10 యొక్క 24-గంటల రోలింగ్ సగటు వరుసగా క్యూబిక్ మీటర్కు 154 మరియు 256 మైక్రోగ్రాములు ఉండాలి. అయితే, గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ఘనపు మీటర్ వాతావరణంలో పీఎం 2.5పై 878 మైక్రోగ్రాములు - పీఎం 10పై 1,179 మైక్రోగ్రాముల కాలుష్య పరమాణువులు ఉన్నట్టు రీడింగ్ నమోదైంది. మామూలు రోజుల్లో ఈ రీడింగ్‌ సాధారణంగా 60 - 100 మైక్రోగ్రాములుగా ఉంటుంది. సాధారణ రక్షిత స్థాయితో పోలిస్తే, దీపావ‌ళి రోజు ఈ కాలుష్య స్థాయి 10 రెట్ల వరకూ పెరిగింది. అయితే, గ‌త సంత్స‌రంతో పోలిస్తే ఈ సంవ‌త్స‌రం వాతావరణం కలుషిత స్థాయి స‌గానికి త‌గ్గింద‌ని ఆ సంస్థ తెలిపింది.

అయితే, సాయంత్రం 6 గంటల వరకూ తమకు పెద్దగా టపాకాయల శబ్దాలు వినిపించలేదు. ఆ తరువాత మాత్రం గ‌త సంవ‌త్స‌రం మాదిరిగానే చిన్నా - పెద్దా తేడాలేకుండా అంద‌రూ పటాసులు కాల్చారు. రాత్రి 11 గంటల తరువాత బాణాసంచా కాల్చవద్దన్న ఆదేశాలను కూడా ఎవరూ పట్టించుకోలేదు. కొంద‌రు ప్ర‌జ‌లు తెల్లవారుఝామున 3 గంటల వరకూ బాంబులు కాలుస్తూ ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించారు. ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా - పంజాబ్ రాష్ట్రాల్లో కూడా వాయు నాణ్యత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల‌లో నిషేధం ఉండ‌డంతో వందలాది మంది ప్ర‌జ‌లు 140 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి, హర్యానాలోని కర్నాల్ - యూపీ పరిధిలోకి వచ్చే నోయిడా తదితర ప్రాంతాల నుంచి క్రాకర్స్ తెచ్చుకుని కాల్చారు. త‌మ బాధ్య‌తా రాహిత్యంతో త‌మ ప్రాంత‌లో వాయుకాలుష్యాన్ని క‌లిగించ‌డం ద్వారా కొంద‌రు తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ ర‌క‌మైన క‌లుషిత గాలిని పీల్చ‌డం ద్వారా ముఖ్యంగా శ్వాస కోస వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ-ఎన్సిఆర్ లో గాలి కాలుష్యంను ఎదుర్కోవడానికి సుప్రీం నియ‌మించిన ఎన్విరాన్మెంట్ పొల్యుషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ (EPCA) సంస్థ వారు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలును ప‌రిశీలిస్తున్నారు.