Begin typing your search above and press return to search.

సర్కారీ దవాఖానాలో పురుడు పోసుకున్న ఆ జిల్లా కలెక్టర్ సతీమణి

By:  Tupaki Desk   |   10 Nov 2021 9:45 AM GMT
సర్కారీ దవాఖానాలో పురుడు పోసుకున్న ఆ జిల్లా కలెక్టర్ సతీమణి
X
నీతులు చాలామంది చెబుతుంటారు. కానీ.. వాటిని ఆచరించే విషయానికి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తుంటారు. ఉన్నత స్థానాల్లో ఉండే వారు ఆదర్శాలు చెప్పటమే కానీ వాటిని పాటించే విషయంలో స్ఫూర్తివంతంగా ఎవరూ కనిపించరు. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే గతంలో గవర్నర్ గా పని చేసిన నరసింహన్ కానీ ప్రస్తుతం గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళ సై కానీ.. వీరిరువురు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రభుత్వ దవాఖానాలైన గాంధీ.. నిమ్స్ కు వెళ్లి చికిత్స చేయించుకోవటం తెలిసిందే. నరసింహన్ అయితే చిన్నపాటి సర్జరీలు కూడా చేయించుకున్న ఘనత ఆయన సొంతం.

అలా అప్పుడప్పుడు మెరిసే మెరుపుల్లో తాజాగా ఒక జిల్లా కలెక్టర్ పేరు బయటకు వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబీకులు సైతం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడని ఈ రోజుల్లో.. ఒక జిల్లా కలెక్టర్ తన భార్య ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవటం అంటే మాటలు కాదనే చెప్పాలి. తాజాగా ఆ పని చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న అనుదీప్. తెలంగాణలో పుట్టి పెరిగి.. రాష్ట్ర కేడర్ కే ఎంపికైన ఈ యువ ఐఏఎస్ అధికారి యువతకు స్ఫూర్తినిచ్చేలా వ్యవహరిస్తుంటారు. అనుదీప్ గురించి చెప్పాల్సి వస్తే.. 2017 బ్యాచ్ లో టాపర్ గా నిలిచిన అతడు ముస్సోరిలో శిక్షణ ముగించుకొని తెలంగాణ కేడర్ నే ఎంపిక చేసుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన సతీమణి మాధవి మొదటి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపిక చేసుకున్నారు.

మంగళవారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ.. తల్లి క్షేమంగా ఉండటం.. కలెక్టర్ చేసిన పని గురించి తెలిసిన వారంతా ఆయన్నుప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ వ్యవస్థలు పూర్తిగా పడకేసినట్లుగా వచ్చే వార్తలకు భిన్నంగా.. కొందరు అధికారుల పుణ్యమా అని.. వాటిపని తీరు ఎంత బాగుందన్న విషయాన్ని చెప్పేస్తున్న తీరును అభినందించాల్సిందే.

కలెక్టర్ సతీమణి మాధవికి ఇది తొలి కాన్పు కావటం.. చివర్లో సర్జరీ చేయాల్సి రావటంతో గైనకాలజిస్టు శ్రీక్రాంతి.. డాక్టర్ భార్గవి.. అనస్థీషియా నిపుణురాలు దేవిక ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి ప్రసవాన్ని పూర్తి చేశారు. దీనికి భద్రాచలం ఏరియా ఆసుపత్రి వేదికగా మారింది. ఇటీవలే ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గా వ్యవహరిస్తున్న స్నేహలత కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకోవటం తెలిసిందే. జిల్లా స్థాయి అధికారి అయినా.. సాదాసీదాగా ప్రభుత్వ ఆసుపత్రిలో తన డెలివరీ చేయించుకోవటంతో అప్పట్లో ఆమె వార్తల్లో నిలిచారు. ఏమైనా.. ఈ తీరును మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.