Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క స‌ర్కారు..కుప్పకూల‌డం ఖాయ‌మే

By:  Tupaki Desk   |   8 Feb 2019 7:01 AM GMT
క‌ర్ణాట‌క స‌ర్కారు..కుప్పకూల‌డం ఖాయ‌మే
X
స‌స్పెన్స్ టీవీ సీరియల్‌ ను మించిన ఉత్కంఠ‌త.....క‌ర్ణాట‌క స‌ర్కారు ప‌రిణామాలు మారుతున్నాయి. కర్నాటక రాజకీయాలు రోజుకో ములుపు తిరుగు తున్నాయి. అతి తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న కుమార స్వామి టీం నుంచి కాంగ్రెస్‌ - జేడీఎస్‌ పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించినట్టు సమాచారం. వారంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. వీరిలో 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. దీంతో, ప్ర‌భుత్వం భ‌విష్య‌త్ ఏంట‌నే అంశం తెర‌మీదకు వ‌స్తోంది.

కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్‌ - జేడీఎస్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు క్యాంపు రాజకీయాలు చేసి - ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ - జేడీఎస్‌ నుంచి ఇప్పుడు ఉన్నపళంగా జారుకొని వెళ్లిపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో మూడు వర్గాలు విడిపోయిన ఎమ్మెల్యేలో కొంత మంది సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ అధినాయకత్వం ఎమ్మెల్యేలను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నా వారు అందుబాటులోకి రాకపోవడంతో కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు.

9 మంది ఎమ్మెల్యేలు బుధవారం నుంచి అసెంబ్లి సమావేశాలకు హాజరుకావడం లేదు. స్పీకర్‌ కేఆర్‌ రమేష్‌ కుమార్‌ హాల్లోకి వచ్చి తన సీట్లో కూర్చున్న తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టు ముట్టి ప్రభుత్వానికి - గో బ్యాక్‌ సీఎం.. గో బ్యాక్‌ సీఎం అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేలను తమ తమ సీట్లలో వెళ్లి కూర్చోవాలని సూచించినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. మళ్లి బీజేపీ నాయకులు నిరసన తెలపడంతో సభను మళ్లి వాయిదా వేశారు. శుక్రవారం కర్నాటక సర్కార్‌ 2019-2020 బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనుంది. మెజార్టీ లేని ప్రభుత్వం బడ్జెట్‌ ఎలా ప్రవేశపెడుతుంది అంటూ బీజేపీ నాయకులు నిలదీశారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని అధికార పక్షం విరుచుకుపడింది.

కాగా, 224 అసెంబ్లి స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 112. బీజేపీకి 104 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి 117 మంది సభ్యుల బలం ఉంది. 117 మందిలో ఇద్దరు స్వతంత్రులు బీజేపీ గూటికి చేరారు. దీంతో కూటమికి బలం 115కు పడిపోయింది. తాజా విప్‌ను ధిక్కరించి 9 మంది కాంగ్రెస్‌ సభ్యులు బుధవారం అసెంబ్లికి డుమ్మా కొట్టారు. వీరంతా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. 115 మంది నుంచి 9 మంది బయటికి వెళ్తే కూటమి బలం 106కు పడిపోయినట్టు తెలుస్తుంది. దీంతో కర్నాటకలో కూటమి ప్రభుత్వం పడిపోయే అవకాశం లేకపోలేదని రాజ‌కీయ విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు.