Begin typing your search above and press return to search.

చిక్కుల్లో ఎమ్మెల్యే సండ్ర.. ఏసీబీ కోర్టులో చుక్కెదురు

By:  Tupaki Desk   |   2 Nov 2020 6:00 PM GMT
చిక్కుల్లో ఎమ్మెల్యే సండ్ర.. ఏసీబీ కోర్టులో చుక్కెదురు
X
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సండ్ర వెంకటవీరయ్య పిటీషన్ తోపాటు ఉదయ సింహ వేసిన డిశ్చార్జి పిటీషన్ ను కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను ఈనెల 4కి కోర్టు వాయిదా వేసింది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో పెద్ద తలకాయలు ఏసీబీ చేతికి చిక్కాయి. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ లాంటి వారు అరెస్ట్ కాగా.. ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇటీవలే విచారణ సందర్భంగా సండ్ర, ఉదయసింహ వేసిన పిటీషన్లపై ఏసీబీ స్పెషల్ పీపీ వాదన వినిపించారు. నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లను కొట్టివేయాలని కోర్టుకు నివేదించారు. ఓటుకు నోటు కేసును నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. వారి పిటీషన్లను కొట్టివేయాలని కోర్టును కోరారు.

ఈ కుట్రలో నిందితుల పాత్ర ఉందనేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసి వీరంతా కుట్రలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు.శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఓటుకు నోటు కుట్రపై రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని.. ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్ లోనూ సండ్ర ప్రమేయం స్పష్టంగా ఉన్నదని ఏసీబీ పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది.

దీంతో ఏసీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.