Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం పై ప్రశంసలు కురిపించిన దిశ తండ్రి!

By:  Tupaki Desk   |   13 Dec 2019 11:20 AM GMT
ఏపీ సీఎం పై ప్రశంసలు కురిపించిన దిశ తండ్రి!
X
మహిళలపై జరిగే అరాచకాలని తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం కొత్తగా దిశ చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం తో ఇకపై ఎవరైనా ఆడవారి పై అఘాయిత్యానికి పాల్పడితే ..ఆ నేరం ఆధారాలతో నిరూపితమైతే కేవలం 21 రోజుల్లోనే నిందుతులకి ఉరి శిక్ష అమలు చేసేలా ఈ దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దిశ చట్టానికి ఆమోదం తెలపడం పట్ల దిశ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడం సంతోషం. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతున్నా’ అని దిశ తండ్రి చెప్పారు.

ఇకపోతే సీఎం జగన్.. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ తరువాత అసెంబ్లీ లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులకు మరోసారి అభినందనలు తెలిపారు. ఈ ఘటనలో తక్షణమే చర్య తీసుకున్నారని గుర్తు చేశారు. ఆడపిల్లల తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యమన్నారు.

నేరం చేస్తే ఎంతటివారినైనా వదలకూడదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. అన్ని ఆధారాలుంటే 21 రోజుల్లో శిక్ష విధించడం దిశ చట్టం ముఖ్య ఉద్దేశం.

సోషల్‌ మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఇకపై మెయిల్స్‌ ద్వారా గానీ, సోషల్‌ మీడియా ద్వారా గానీ, ఇతర ఏ విధమైన డిజిటల్‌ విధానంలోనైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దిశ చట్టం ద్వారా మొదటి తప్పునకు 2 ఏళ్లు, ఆ తర్వాత తప్పునకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు.