Begin typing your search above and press return to search.

‘దిశా’ ఎన్ కౌంటర్.. ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

By:  Tupaki Desk   |   4 Aug 2021 9:30 AM GMT
‘దిశా’ ఎన్ కౌంటర్.. ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
X
తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది ‘దిశ’ హత్యోదంతం.. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా మహిళా లోకాన్ని ఆందోళన బాట పట్టించింది. మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేసేలా చేసింది. తెలుగురాష్ట్రాల ప్రజలు ఎవరూ దీన్ని మర్చిపోలేదు.

హైదరాబాద్ లో ఓ మెడికో యువతిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి దారుణంగా బతికుండగానే తగుల బెట్టిన వైనం సంచలనమైంది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ కూడా చేశారు. నాడు తెలంగాణ సర్కార్ తీరుపై మొదట విమర్శించిన అందరూ ఎన్ కౌంటర్ తర్వాత తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా అప్పటి దిశ ఎన్ కౌంటర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణ ఈరోజు జరిగింది.

ఈ సందర్భంగా విచారణ కమిటీ నివేదిక దాఖలుకు మరో ఆరు నెలల సమయం కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం గడువు కోరడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. పదే పదే ఎందుకు సమయం కోరుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది.

ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ కేసులో 170మందిని ప్రశ్నించారు. ఇంకా ఎందరిని ప్రశ్నించాలని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ కేసును త్వరలో తేల్చాలని సీజేఐ రమణ స్పష్టం చేశారు.

కాగా దిశ రేప్ కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రేప్ చేసిన స్థలంలోనే నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.