Begin typing your search above and press return to search.

టీడీపీలో చ‌ర్చఃనంద్యాల...తేలేదెలా?

By:  Tupaki Desk   |   30 April 2017 5:44 AM GMT
టీడీపీలో చ‌ర్చఃనంద్యాల...తేలేదెలా?
X
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఆస‌క్తిక‌రంగా మారింది. ఏకంగా ముఖ్య‌మంత్రి - పార్టీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ ప‌రిష్కారం దొర‌క్క‌పోగా సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగేలా ఉంది. శనివారం రెండు విడతలుగా భూమా - శిల్పా వర్గాలతో భేటీ అయిన నాయకత్వం, ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పటివరకూ వారి మధ్య ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని నిర్ణయించింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై జరుగుతున్న వ్యవహారం - అంతర్గత పోరుకు తెరదించే లక్ష్యంలో భాగంగా.. ఆ సీటు ఆశిస్తోన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి - ఆయన సోదరుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు - తన కుటుంబానికే సీటు ఇవ్వాలని వాదిస్తోన్న మంత్రి అఖిలప్రియ - నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి - ఆయన అల్లుడు శ్రీ‌ధ‌ర్‌ రెడ్డి శనివారం మధ్యాహ్నం నుంచి గుంటూరు పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో విడివిడిగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీవై రెడ్డి తన అల్లుడు శ్రీ‌ధ‌ర్‌ రెడ్డికి సీటు అడిగినా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో భూమా కుటుంబానికే ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. అయితే అఖిలప్రియ మాత్రం తన తండ్రి స్థానంలో సోదరుడైన బ్రహ్మానందరెడ్డికే సీటు ఇవ్వాలని వాదించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇష్టం లేకపోయినా బాబు ఆదేశాలకు కట్టుబడి శిల్పా చక్రపాణిరెడ్డికి తన వర్గీయులతో ఓటు వేయించిన విషయాన్ని గుర్తు చేసినట్లు సమాచారం. అటు శిల్పా సోదరులు కూడా సీటు తమకే ఇవ్వాలని, నంద్యాలలో తమకే పట్టు ఉందని, సీటు ఇవ్వకపోతే తన వర్గాన్ని కాపాడుకోవడం కష్టమని చెప్పారు. ఇప్పటికే తమపై కార్యకర్తల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయని కళాకు చెప్పినట్లు సమాచారం. అయితే బయటకు వచ్చిన శిల్పా మోహన్‌ రెడ్డి తాను పార్టీ మారబోనని, నాయకత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మీడియాకు చెప్పారు. అక్కడి నుంచి వ్యవహారం చంద్రబాబునాయుడు నివాసానికి చేరింది. అందరూ విడిగా బాబును కలిసి తమ డిమాండ్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా అందరికంటే మంత్రి అఖిలప్రియ బాబుతో ఎక్కువ సేపు మాట్లాడారు. సోదరుడు బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వంపై పట్టుపడుతున్న అఖిలకు బాబు నచ్చచెప్పారని, అందుకే ఆమెతో అంతసేపు మాట్లాడారని పార్టీ వర్గాల సమాచారం. ఆఖరులో మాత్రం మీ నిర్ణయానికే వదిలేస్తున్నాని, శిల్పా పంతానికి పోతున్నందుకే తానూ పంతానికి దిగవలసి వస్తోందని బాబుకు చెప్పినట్లు తెలిసింది. చివరకు అభ్యర్థిని ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖరారు చేద్దామని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే శిల్పా బ్రదర్స్‌ ను మ‌రోమారు త‌న‌తో భేటీ కావాల‌లని బాబు సూచించినట్లు సమాచారం. దీంతో ఏం జ‌ర‌గ‌నుందనే ఉత్కంఠ అంద‌రిలో నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/