Begin typing your search above and press return to search.

ఏపీతో లొల్లిలో ‘‘కేసీఆర్’ మాటకు సుప్రీం నో

By:  Tupaki Desk   |   12 Aug 2016 5:31 AM GMT
ఏపీతో లొల్లిలో ‘‘కేసీఆర్’ మాటకు సుప్రీం నో
X
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్నపంచాయితీలు అన్నిఇన్ని కావు. విడిపోయి కలిసి ఉందామంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో నినాదాలు చేసిన దానికి పూర్తి భిన్నంగా.. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన సాగుతున్న కోల్డ్ వార్ అందరికి తెలిసిందే. నిజానికి రెండుతెలుగు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీల విషయంలో కమిట్ మెంట్ తోఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చలు జరిపితే.. సమస్యలకు సొల్యూషన్లు దొరికే పరిస్థితి. కానీ.. అందుకు భిన్నంగా ఎవరికి వారు.. ఏ విషయంలోనూ తగ్గకుండా కోర్టులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ప్రతిదీ పీటముడిగా మారుతున్న దుస్థితి.

ఆ మధ్యన ఆంధప్రదేశ్ ఉన్నత విద్యామండలి బ్యాంకు అకౌంట్స్ ను స్తంభింపచేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. అది తప్పంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర వాదనను కొట్టేసింది. ఏపీ ఉన్నత విద్యా మండలి ఖాతాల్నినిలిపివేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేనేలేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

విభజనకు ముందు మండలి ఖాతాల్లోని నిధులను జనాభా నిష్పత్తి ప్రాతిపదికన (58: 42)ప్రకారం పంచుకోవాలని తేల్చింది. ఒకవేళ అలా చేయని పక్షంలో విభజన చట్టంలని సెక్షన్ 47 నిరుపయోగం అవుతుందని సుప్రీం పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారంఖాతాలు తమకే సొంతమంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనను కొట్టేసిన సుప్రీంకోర్టు పుణ్యమా అని ఏపీతో లొల్లి విషయంలో కేసీఆర్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఒకటి తర్వాత ఒకటిగా కోర్టుల్లో కేసీఆర్ సర్కారుకు తగులుతున్న ఎదురుదెబ్బలతో అయినా..ఆత్మవిమర్శ చేసుకుంటే రానున్న రోజుల్లో ఎదురుదెబ్బలు తగిలే అవకాశం తగ్గుతుంది. అందుకు కేసీఆర్ లాంటి అధినేత పాజిటివ్ గా రియాక్ట్ అవుతారంటారా?