Begin typing your search above and press return to search.

దినకరన్ బన్ గయా బకరా!

By:  Tupaki Desk   |   3 Aug 2017 12:30 AM GMT
దినకరన్ బన్ గయా బకరా!
X
తమిళనాడులోని ప్రభుత్వం మొత్తం ఇక తమ పాదాల వద్ద సాగిలపడిపోయినట్లే అనేంత స్థాయిలో పాపం.. వారు మొన్న మొన్నటి దాకా ఆశల పల్లకి ఊరేగారు. జయలలిత మరణించిన తర్వాత.. ఆమె ఆస్తుల్లో చాలా వరకు దక్కినట్లే.. తమిళనాట రాజ్యాధికారం కూడా తమదే అనుకున్నారు. దానికి తగినట్లుగా.. అన్నాళ్లూ జయలలిత పాదాలకు మొక్కిన తమిళ ఎమ్మెల్యేలు, తన పాదాలకు మొక్కుతూ ఉండేసరికి నెచ్చెలి శశికళ మురిసిపోయారు. ఎంత వైభోగం దక్కిందా అని అనుకున్నారు. మేనల్లుడిని పార్టీకి సర్వాధికారిని కూడా చేసేశారు. అయితే నెలలు గడిచేసరికి పరిణామాలు మొత్తం మారిపోయాయి. శశికళ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆమె తరఫున ప్రభుత్వాన్ని శాసిస్తూ నడిపించగల శక్తిగా మొన్నటిదాకా కలలు గన్న టీటీవీ దినకరన్ ప్రస్తుత పరిణామాల అనంతరం బకరాగా మారిపోయారు.

ఈ సందర్భం మీకు గుర్తుందా? జయలలిత మరణించినప్పుడు పరామర్శకు వచ్చినప్పుడు మోడీ పన్నీర్ సెల్వం తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు. అంతా నేను చూసుకుంటాను లెమ్మని భరోసా ఇచ్చినట్లుగా ఆ భంగిమ పాపులర్ అయింది. ఇప్పుడు అంతా ఆయనే చూసుకున్నారు. రెండు చీలిక వర్గాలను ఒక్కటి చేశారు. ఎవ్వరూ అసంతృప్తికి గురికాకుండా రాజీ చేశారు. పన్నీర్ కేంద్రంలో బెర్త్ ఎక్కబోతున్నారు. ఇన్ని పరిణామాల మధ్యలో బకరాగా మారింది టీటీవీ దినకరన్ ఒక్కడే అని తమిళనాట జనం జోకులేసుకుంటున్నారు.

అంతా తమదే హవా అనుకున్న దినకరన్ ఇవాళ ఎవ్వరికీ పట్టని వ్యక్తి అయిపోయారు. ఇంత కీలక పరిణామాలు జరుగుతూ ఉంటే ఆయన గురించి పట్టించుకున్న వారు లేరు. ఆయన ఎంచక్కా పరప్పన జైలుకు వెళ్లి మేనత్త శశికళతో మంతనాలు సాగించారు. ఏం మంతనాలు చేసినా.. ఇప్పట్లో ఆయన హవా తిరిగి మొదలయ్యేదీ లేదు.. ఇక్కడితో మూణ్నాళ్ల వైభోగం ముగిసినట్లే!!