Begin typing your search above and press return to search.

ఆ కిడ్నాపర్లని కూడా సజీవదహనం చేయాలి ..దీక్షిత్ తల్లి డిమాండ్ !

By:  Tupaki Desk   |   22 Oct 2020 4:10 PM GMT
ఆ కిడ్నాపర్లని కూడా సజీవదహనం చేయాలి ..దీక్షిత్ తల్లి డిమాండ్ !
X
మహబూబాబాద్ ‌లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ బాలుడి శవం మహబూబాబాద్ శివారులో గుర్తించారు. గత ఆదివారం దీక్షిత్ ‌ను దుండగులు కిడ్నాప్ చేసి , బాలుడిని అప్పగించేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. దీనితో కొడుకు కంటే తమకి ఏది ఎక్కువ కాదు అని , కిడ్నాపర్లు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు దీక్షిత్ తండ్రి తెలిసినవారి వద్ద అప్పులు చేసి , డబ్బు సిద్ధం చేశారు. ఆ డబ్బుల బ్యాగుతో కిడ్నాపర్లు రమ్మన్న చోటికి వెళ్లేందుకు సైతం సిద్ధపడ్డాడు. అయితే , ఆలోపే దుండగులు బాలుడ్ని హత్య చేయడంతో తల్లిదండ్రుల భాద వర్ణనాతీతం. డబ్బులు ఇస్తామని చెప్పినా తమ కొడుకుని అన్యాయంగా చంపేశారని రోదిస్తున్నారు.

బాలుడిని కిడ్నాప్ చేసిన కొద్ది సమయంలోనే చిన్నారి దీక్షిత్‌ను కిడ్నాపర్‌ సాగర్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈజీగా, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి తెగబడ్డాడన్నారు. అయితే పిల్లాడు తనను గుర్తు పడతాడన్న భయంతోనే హత్య చేశాడని తెలిపారు. దీక్షిత్‌ హత్యకు సంబంధించిన వివరాలను మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మెకానిక్‌గా పనిచేస్తున్న సాగర్‌… ఆ ప్రాంతంలో తరచుగా తిరుగుతుండేవాడు. బయటకు వెళ్లొద్దామని సాగర్ రమ్మనగానే… ఏ మాత్రం అనుమానం లేకుండా దీక్షిత్ అతడి బైక్‌ ఎక్కి , వెళ్ళిపోయాడు. ఆ తరువాత గుట్టల్లోకి తీసుకువెళ్లి , తనని గుర్తు పడతాడేమో అన్న అనుమానంతో ఆ బాలుడి గొంతు నులిమి చంపేశాడు. పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాతే తల్లిదండ్రులతో బేరసారాలు మొదలుపెట్టాడు. ఫేక్‌ కాల్‌ యాప్‌ ద్వారా వారితో మాట్లాడాడు. అయితే డబ్బును చూసేందుకు స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయడంతో , ఆ ఐడి ట్రాక్ చేసి , పోలీసులు నిందితులని చాకచక్యంగా పట్టుకున్నారు.అయితే , అప్పటికే బాలుడు చనిపోయాడు అని తెలిసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

అయితే , ఈ ఘటన పై దీక్షిత్ తల్లి మాట్లాడుతూ ...కిడ్నాపర్లు అడిగినంత డబ్బు ఇస్తాం అని మేము చెప్పం, దీనితో తన కుమారుడు క్షేమంగా వస్తాడని భావించానని, కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదని బాలుడి తల్లి వసంత కన్నీరుమున్నీరు అవుతుంది. దీక్షిత్ ఇక లేడు అనే వార్తను తల్లి జీర్ణించుకోలేకపోతోంది. ఆమెని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. తన కుమారుడిని ఏ విధంగా అయితే చంపాడో అదే విధంగా నిందితుడిని కూడా సజీవదహనం చేయాలని వసంత డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించాము, అన్నా అని బతిమాలాను, నా కొడుకుని ఏమీ చేయొద్దని వేడుకున్నా, అయినా కనికరం లేకుండా తన బిడ్డను చంపేశాడని ఆమె ఒకటే ఏడుస్తుంది.