Begin typing your search above and press return to search.

డిజిటల్ లావాదేవీల కోసం కేంద్రం కొత్త యాప్

By:  Tupaki Desk   |   24 Dec 2016 10:08 AM GMT
డిజిటల్ లావాదేవీల కోసం కేంద్రం కొత్త యాప్
X
పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో క్యాష్ లెస్ ట్రాంజాక్షన్లు బాగానే పెరిగాయి. కానీ.. క్రెడిట్ కార్డులు - డెబిట్ కార్డులు - నెట్ బ్యాంకింగ్ - మొబైల్ బ్యాంకింగ్ - యూపీఐ - యూఎస్ ఎస్ డీ - వ్యాలట్లు... ఇలా అనేక విధానాల్లో పేమెంట్లు ఉంటున్నాయి. అసలే డిజిటల్ అనగానే జనాల్లో ఎంతో భయం ఉండగా.. రకరకాల విధానాల కారణంగా మరింత గందరగోళం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వీటన్నిటికంటే సులభంగా కేవలం ఆధార్ కార్డుతో పేమెంట్లు జరిపేలా కొత్త విధానం తీసుకొస్తోంది. కార్డులు - వ్యాలట్లు అవసరం లేకుండా.. బ్యాంకు ఖాతా - దానికి లింకు చేసిన మొబైల్ నంబర్ ఉంటే చాలు నిమిషంలో దుకాణంలో నగదు చెల్లించవచ్చు. దీన్ని కేంద్ర సర్కారు క్రిస్ మస్ రోజున విడుదల చేయనుంది. ఐడీఎఫ్ సీ బ్యాంకు - యూఐడీఏఐ - ఎన్ పీఐ ఈ ఆధార్ యాప్ ను రూపొందించాయి.

దుకాణాదారులు ఆధార్ క్యాష్ లెస్ మర్చంట్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, రూ.2,000 ఖరీదు చేసే బయోమెట్రిక్ రీడర్ మెషిన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వేలిముద్రలను గుర్తించే పరికరం అనమాట. ఈ మెషిన్ ను తన ఫోన్ కు అనుసంధానించుకోవాలి. ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత దుకాణాదారుడి వద్దనున్న ఆధార్ యాప్ లో కస్టమర్ తన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. బ్యాంకు పేరును సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ రీడర్ పై వేలిని ఉంచితే చాలు లావాదేవీ పూర్తయినట్టే. వేలిముద్రను స్కాన్ చేసిన తర్వాత అది ఆధార్ డేటాతో పోల్చుకుంటుంది. సరిగ్గానే ఉన్నట్టయితే బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీకి సరిపడా నగదు దుకాణాదారుడి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఎలాంటి పాస్ వర్డ్ లు - పిన్ నంబర్లు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది కూడా లేదు.

దేశంలో సుమారు 40 కోట్ల ఆధార్ నంబర్లు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉన్నాయి. మొత్తం వయోజనుల్లో సగం సంఖ్యకు ఇది సమానం. మార్చి నాటికి దేశంలోని ప్రతి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్ తో అనుసంధానించాలన్నది టార్గెట్. దీంతో అప్పటికి మొత్తంగా క్యాష్ లెస్ ఎకానమీ సిద్ధిస్తుందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/