Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో అన్నీ అవస్థలే

By:  Tupaki Desk   |   8 March 2017 5:18 AM GMT
అసెంబ్లీలో అన్నీ అవస్థలే
X
అమరావతిలో నిర్మించిన కొత్త అసెంబ్లీలో ప్రారంభమైన రెండోరోజునే వైఫల్యాలు వెలుగుచూశాయి. విధులకు హాజరయ్యేవారు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండే ఎండలో కనీసం మంచినీళ్ళు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీలో తాగేందుకు చుక్కు నీరు లేకపోగా.. కనీసం బాత్‌రూముల్లో సైతం నీరు రావడం లేదు. దీంతో సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.

మరవైపు అసెంబ్లీ వద్ద బందోబస్తు సిబ్బంది నానా హంగామా చేస్తున్నారు. జర్నలిస్టులకు అసెంబ్లీ కార్యదర్శి సంతకంతో జారీ చేసిన పాస్‌ లు చూపించినప్పటికీ వదలని పోలీసులు మీ గుర్తింపు కార్డులు చూపాలంటూ పట్టుబడుతున్నారు. ఐదు అంచెల పోలీసు తనిఖీలు దాటందే అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లలేని పరిస్ధితి.

ఇక మీడియా పాయింట్ వద్ద పరిస్థితి దుర్భరం. సమీపంలోని పోలీసులు ప్రతి జర్నలిస్టు పేరు - సంస్థ - ఫోన్ నెంబర్ చెప్పాలంటూ నమోదు చేసుకుంటున్నారు. పోలీసుల తీరుపై పలువురు మీడియా ప్రతినిధులు మండిపడటంతో మాకెందుకు సార్ మా బాస్ చెప్పారు. మేం ఉద్యోగం చేయాలి కాబట్టి తప్పదు అంటూ పలువురు భద్రతా సిబ్బంది వాపోతున్నారు. ఇక మండే ఎండలో షెడ్డులాంటి మీడియా పాయింట్ పాయింట్‌ లో విలేఖరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. కనీసం గొంతు తడుపుకునేందుకు కూడా చుక్క నీరు అందుబాటులో లేదని చెబుతున్నారు.

కొత్త టెక్నాలజీ పేరుతో ఏర్పాటు చేసిన మైక్‌లు సక్రమంగా పని చేయడం లేదు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే స్పీకర్ కోడెల దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీ గ్యాలరీలో సిట్టింగ్ స్టెప్స్ హైట్ లేకపోవడంతో వెనుక కూర్చున్నవారికి ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. సభలో ప్రశ్నోత్తరాలు జవాబులకు సంబంధించిన సమాచార ప్రతిని ఇవ్వడం లేదని.. మండలి ప్రెస్ గ్యాలరీలో సీట్లు వేసేందుకు చోటు ఉన్నప్పటికీ పరిమితంగా 17సీట్లు మాత్రమే వేయడంతో గంటల తరబడి నిలబడి రాసుకోవాల్సి వస్తోందని జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/