Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు వైసీపీ మంత్రులను సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెలేశారా..!

By:  Tupaki Desk   |   30 Oct 2019 4:26 AM GMT
ఆ ఇద్దరు వైసీపీ మంత్రులను సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెలేశారా..!
X
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయిందో లేదో అన్ని జిల్లాల్లోనూ ఆ పార్టీ నేతల మధ్య గ్రూపు రాజ‌కీయం జోరందుకుంది. జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి, గ్రామస్థాయి వరకు ఎక్కడికి అక్కడ గ్రూపు రాజకీయాలు జోరుగా న‌డుస్తున్నాయి. ప్రభుత్వ పథకాల విషయంలోనూ పార్టీ పరమైన పదవుల‌ విషయంలోనూ తమ మాటే నెగ్గాలి అన్న పంతానికి పోవడంతో గ్రూపుల గోల ఎక్కువయింది. ఇదిలా ఉంటే ఒక జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాకు చెందిన మంత్రులను వెలివేశారు అన్న మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది. జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన నేతలందరూ సీనియర్లే. ఆనం రామనారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే జగన్ ఈ సీనియర్లను కాదని వీరికంటే జూనియర్ అయిన‌ అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డికి తన కేబినెట్లో చోటు కల్పించారు. ఈ విషయంలో జగన్ తీరుపై సీనియర్ ఎమ్మెల్యేలు అందరు గుస్సాతో ఉన్నారు.

అసలు వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణం చేసి జిల్లాకు వచ్చినా జిల్లా ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు స్వాగతం పలకలేదు. చివరకు వాళ్లకు వాళ్ల సొంత నియోజకవర్గ ప్రజలు మినహా ఎవరు స్వాగతం పలక లేదంటే ఈ జూనియర్ మంత్రులపై సీనియర్ ఎమ్మెల్యేలు ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలుస్తోంది. ఎంత విచిత్రం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇద్దరు మంత్రులను తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం వీరికి తమ నియోజకవర్గాల్లో నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఈ ఇద్దరు మంత్రులు నెల్లూరు జిల్లాలో తమ నియోజకవర్గాలను మినహాయించి పక్క నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా వీలు లేదు.

ఇటీవల కాకాని గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తినా అధిష్టానం రంగంలోకి దిగి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. అయినా సరే ఎమ్మెల్యేలందరూ ఒక చోట కూర్చుని పార్టీ కోసం చర్చించిన దాఖలాలు ఇప్పటి వర‌కు అయితే లేవు.. అంతదాకా ఎందుకు ? అమరావతికి వచ్చిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి ఛాంబర్లను మినహాయించి అందరు మంత్రుల‌ వద్దకు వెళుతున్నారు. తమ నియోజకవర్గ పనులు చేయించుకుంటున్నారు. ఇలా నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులను వైసీపీ ఎమ్మెల్యేలు వెలివేశారనే చర్చలే జిల్లాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సీనియర్లలో జగన్ ఎవరికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో వారంతా జట్టుకట్టి మరి ఈ ఇద్ద‌రిపై తమ అసహనాన్ని ఇలా చూపిస్తున్నారు అట.