Begin typing your search above and press return to search.

మోడీషాల మైండ్ సెట్ ను చదివేయటం అలవాటైందా?

By:  Tupaki Desk   |   26 July 2021 3:30 PM GMT
మోడీషాల మైండ్ సెట్ ను చదివేయటం అలవాటైందా?
X
ఐరన్ కర్టన్ లా ఉంటుంది బీజేపీ అంతర్గత వ్యవహారాలు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ కు పూర్తి విరుద్ధంగా బీజేపీ వ్యవహారాలు ఉంటాయి.గతానికి భిన్నంగా ఇప్పుడా పార్టీ మారింది. సంఘ్ పరివార్.. బీజేపీ అధినాయకత్వంలోని కొద్ది మంది నేతల ఉమ్మడి నిర్ణయాల్ని బీజేపీ అంతిమ నిర్ణయంగా ఉండేది. ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో.. అప్పటి నుంచి కమలనాథుల పార్టీలో కొట్టొచ్చిన మార్పు ఒకటి కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీ రూపురేఖల్ని మార్చేయటమే కాదు.. మోడీ అనుకూలురు మాత్రమే ఉండేలా ఒక నిశ్శబ్ద ఆపరేషన్ జరిగింది. అద్వానీ లాంటి అగ్రనేతను.. సోది లేకుండా చేయటం.. ఆయన అనుకూల వర్గానికి రెండే రెండు ఆప్షన్లు ఇవ్వటం లాంటివి మీడియాలో పెద్దగా రికార్డు కాకుండానే జరిగిపోయాయి.

మోడీషాల చేతికి పార్టీ పగ్గాలు వచ్చేసిన తర్వాత.. అయితే మోడీకి విధేయులుగా ఉండటం.. లేదంటే పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత.. ప్రాధాన్యత లేకుండా కాలగర్భంలో కలిసి పోవటం. తమను కాదని ఎవరైనా గళం విప్పే ప్రయత్నం చేస్తే.. వారికి పార్టీలో ఐడెంటిటీ అన్నదే లేకుండా చేయటం లాంటివి గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయాయి. తమ లైన్ కు భిన్నంగా బీజేపీ నడిచిన ప్రతిసారీ కంట్రోల్ చేసే సంఘ్ పరివార్ సైతం మోడీషాల విషయంలో అంత ఎక్కువగా కల్పించుకోలేదని చెబుతారు.ఇటీవల కాలంలో మరే ప్రధానమంత్రికి రానంత క్రేజ్ ను మోడీ సొంతం చేసుకున్న వేళలో.. ఆయన్ను మిగిలిన వారి మాదిరి కంట్రోల్ చేసే పరిస్థితి సంఘ్ పెద్దల చేతిలో కూడా లేదని చెబుతారు. అలా అని ఉనికి లేదని చెప్పలేం కానీ.. గతంతో పోలిస్తే.. సంఘ్ ఒత్తిడి బీజేపీ అధినాయకత్వం మీద లేకుండా మారింది.

ఈ కారణంతోనే బీజేపీలో తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఎలాంటి మార్పు అయినా బయటకు రాని పరిస్థితి. సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమాచార సేకరణ చేసే మీడియా ప్రతినిధులకు.. భారీ నెట్ వర్కు ఉండే రిపోర్టర్లు సైతం మోడీషాల గుట్టును చేధించే విషయంలో సక్సెస్ కాలేదని చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో పార్టీ గుట్టు కొంచెం కొంచెం బయటకు వస్తుందని చెప్పాలి. దీనికి ఈమధ్యనే చోటు చేసుకున్న రెండు పరిణామాల్ని ప్రముఖంగా చెప్పొచ్చు. అందులో ఒకటి కేంద్ర కేబినెట్ ను త్వరలో పునర్ వ్యవస్థీకరణ చేసే దిశగా మోడీషాలు నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వచ్చిన కొద్దిరోజులకే కేబినెట్ ప్రక్షాళన జరిగింది.

అంతేనా.. అండర్ పెర్ ఫార్మరెన్స్ కానీ.. పని తీరు మీద హ్యాపీగా లేని నేతలను సగౌరవంగా ఇంటికి పంపే కార్యక్రమాన్ని మోడీషాలు మొదలు పెట్టిన విషయాన్ని మీడియా గుర్తించి.. వారి పేర్లను బయటపెట్టింది. గతానికి భిన్నంగా ఈ మధ్యన మోడీషాల నిర్ణయాలు అంతో ఇంతో బయటకు వస్తున్నాయని చెప్పాలి. తాజాగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యడ్యూరప్పను తొలగిస్తారన్న ప్రచారం కొన్ని వారాలుగా సాగుతోంది.

మీడియా కథనాల్ని మొదట కొట్టిపారేసినా.. చివరకు ఆ కథనాలే నిజం కావటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు మోడీషాలను మీడియా క్రాక్ చేసిందా? అన్న సందేహం కలుగక మానదు. ఇటీవల కాలంలో బీజేపీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలు బయటకు వస్తున్న వైనం చూస్తే.. ఇన్నాళ్లకు మీడియా వారిని అంచనా వేయటంలో చురుగ్గా వ్యవహరిస్తుందని చెప్పాలి.

అయితే.. ఈ వాదనలో నిజం లేదని.. కరోనా సెకండ్ వేవ్ తో పాటు.. దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తున్న నేపథ్యంలో పార్టీ పరంగా చేసే మార్పుల్ని ఒక క్రమపద్దతిలో మీడియాకు లీక్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ముందే అంశాల్ని లీక్ చేయటం ద్వారా.. ప్రజల ప్రతిస్పందన తెలుసుకునేందుకు వీలుగా చేస్తున్నారని.. అందుకే గతానికి భిన్నంగా మోడీషాలు డిసైడ్ అయిన నిర్ణయాలు కొంతమేర బయటకు వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. మీడియా వరకు.. మోడీషాలను క్రాక్ చేసినట్లేనని చెప్పక తప్పదు.