Begin typing your search above and press return to search.

అయోధ్యా రాముడు యోగిని దీవించాడా...?

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:30 AM GMT
అయోధ్యా రాముడు యోగిని దీవించాడా...?
X
యూపీ ఎన్నికల్లో మరోసారి గెలిచి వరసగా రెండవసారి ముఖ్యమంత్రి కావాలని పాత రికార్డులు తిరగరాయాలని యోగీ ఆదిత్యనాధ్ భావిస్తున్నారు. పైగా ఆదిత్యనాధ్ కి ఈ ఎన్నికలు అన్ని విధాలుగా అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి. అయిదు సార్లు ఎంపీగా గెలిచిన యోగీ ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన అయిదేళ్ల ముఖ్యమంత్రిత్వం అంతా కూడా ఎమ్మెల్సీగానే సాగింది. మరి యోగీ ఈసారి మాత్రం అసెంబ్లీ నుంచే ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు.

ఒక విధంగా ఇది ఆయనకు కొత్త ప్రయోగంగానే చూడాలి. యోగీ మొదట అయోధ్య నుంచే పోటీ చేయాలనుకున్నారుట. తన పదవీకాలంలో ఆయన ఎక్కువగా అయోధ్య మీదనే ఫోకస్ చేశారు. ఆయన సీఎం గా ఉండగానే రామమందిరం నిర్మాణం జరుగుతోంది. దాంతో ఆ కీర్తిని తన ఖాతాలో వేసుకోవాలంటే అయోధ్య నుంచి బరిలోకి దిగితేనే సులువు అని ఆయన అనుకున్నారు.

అయితే ఈ విషయంలో అయోధ్య రాముడు మాత్రం యోగీని అక్కడ నుంచి వద్దు అనుకున్నాడా అంటే రామమందిరం తాత్కాలిక పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ అదే నిజమని అంటున్నారు. యోగీకి యూపీలో ఇపుడు ఒక విధంగా గట్టి సవాల్ ఎదురవుతోంది. పైగా అయోధ్యలో చూసుకున్నా గతంలోనూ బీజేపీ గెలవలేదు. దాని మీద విపక్షాలు కూడా ఎద్దేవా చేసేవి. రాముడు ఉన్న చోటనే కాషాయ పెద్దలు ఓడారని.

ఇపుడు యోగీ పోటీ చేస్తే ఓడిపోతారని ఆలయ పూజారి అంటున్నారు. దానికి కారణం అయోధ్య రామాలయం కోసం అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉన్న వారిని పెద్ద ఎత్తున ఖాళీ చేయించారు. అలాగే దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారిని కూడా అక్కడ నుంచి వేరే చోటకు తరలించారు. ఆ విధంగా చాలా మందికి బీజేపీ సర్కార్ మీద ప్రత్యేకించి యోగీ మీద పీకల బండెడు కోపం ఉందిట.

ఈ నేపధ్యంలోనే తాను కూడా అయోధ్యలో పోటీ చేయవద్దు అని యోగీకి సూచించాను అని పూజారి చెప్పుకున్నారు. ఇది తన మాట కాదు ఆ రాముడి మాట కూడా అని అంటున్నారు. అనుకున్నట్లుగానే కలలో కనిపించి రాముడు చెప్పాడో లేక యోగీని అలా ఆశీర్వదించారో తెలియదు కానీ అప్పటిదాకా అయోధ్య అని ఊగిన యోగీ చివరి నిముషంలో గోరఖ్ పూర్ నుంచి పోటీకి దిగాలనుకున్నారు. ఇది మంచి పరిణామమని యోగీ తప్పక గెలుస్తారు అని పూజారి అంటున్నారు.

ఇక అయోధ్య మాత్రమే కాదు పరిసర నియోజకవర్గాల్లో బీజేపీకి కొంత గడ్డు పరిస్థితి ఉందిట. బీజేపీ జాతీయ‌ నేతలు కొందరు అయితే యోగీ అయోధ్య లో పోటీలో ఉంటే ఆయన ప్రభావం మిగిలిన చోట్ల కూడా పడి బీజేపీ గెలుస్తుంది అనుకున్నారుట. మరి యోగీ సీటు మార్చేశారు. ఇపుడు అయోధ్య రాముడే అక్కడ మొత్తం బీజేపీని గెలిపించాలి. మరి యోగీని సీఎం కావడానికి సీటు మార్పించిన రాముడు బీజేపీని పవర్ లోకి తీసుకురారా ఏమిటి. ఇదే ధీమాతోనే యూపీ బీజేపీ నేతలు కూడా ఉన్నారుట.