Begin typing your search above and press return to search.

భార‌త్ లోని ర‌హ‌స్య స‌మాచారం పాకిస్థాన్ కు చేరిందా?

By:  Tupaki Desk   |   13 July 2022 7:42 AM GMT
భార‌త్ లోని ర‌హ‌స్య స‌మాచారం పాకిస్థాన్ కు చేరిందా?
X
భార‌త్ లోని ర‌హ‌స్య స‌మాచారం పాకిస్థాన్ కు చేరిందా అంటే అవున‌నే అంటున్నారు.. ప్ర‌ముఖ పాకిస్థాన్ కాల‌మిస్ట్ నుస్ర‌త్ మిర్జా. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో తాను ఐదుసార్లు ఇండియాలో ప‌ర్య‌టించాన‌ని.. ఆ స‌మ‌యంలో ముఖ్య‌మైన ర‌హ‌స్యాల‌ను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ)కి చేర‌వేసిన‌ట్టు బాంబు పేల్చారు. ఈ మేర‌కు ఒక టీవీ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో తాను పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్ర‌​ ముఖ్యమంత్రి వద్ద సలహాదారుగా కూడా పనిచేశాన‌ని నుస్రత్​ మిర్జా తెలిపారు. త‌ద్వారా భార‌త్ లో డిప్లొమాటిక్ వీసా ద్వారా ప‌ర్య‌టించాన‌న్నారు. ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారుగా ప‌నిచేయ‌డంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు త‌న‌కు భారత్‌లో పర్యటించేందుకు అవ‌కాశం ల‌భించింద‌న్నారు.

పాకిస్థాన్ విదేశాంగ శాఖ త‌న‌ను చాలాసార్లు భారత్ కు పంపింద‌న్నారు. సాధారణంగా భారత్‌లో మూడు ప్రాంతాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతులు ఇస్తారని.. కానీ తనకు ఏడు ప్రాంతాల్లో పర్యటించేలా అనుమతిచ్చారని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు మహ్మద్​ హమీద్​ అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో త‌న‌ను భారత్‌కు ఆహ్వానించార‌ని నుస్రుత్ మీర్జా తెలిపారు. 2007-2017 మ‌ధ్య‌ ఐదు సార్లు భారత్‌కు వ‌చ్చి. దిల్లీ, బెంగళూరు, చెన్నై, పాట్నా, కోల్‌కతాల్లో పర్యటించాన‌ని వెల్ల‌డించారు.

భారత నాయకుల బలహీనతలన్నీ ఐఎస్‌ఐకి తెలుసు అని వ్యాఖ్యానించారు. భార‌త్ నుంచి విలువైన స‌మాచారం సేక‌రించి పాకిస్థాన్ లోని ఐఎస్‌ఐకి అందించానని మీర్జా పేర్కొన్నారు.

కాగా ప్రపంచ దేశాలేవీ పాకిస్థాన్ ను న‌మ్మ‌డం లేద‌ని నుస్రత్ మీర్జా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఆ న‌మ్మ‌కాన్ని పోగొట్టుకుంద‌న్నారు. చైనాను పాకిస్థాన్ అతిగా న‌మ్ముతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్‌తో పాకిస్థాన్ కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు అన్నారు. చైనా త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే పాకులాడుతుంద‌ని అన్నారు. ఈ విష‌యంలో పాక్ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందేన‌ని చెప్పారు.