Begin typing your search above and press return to search.

434 మంది ప్రజాప్రతినిధులు గోడలు దూకేశారా ?

By:  Tupaki Desk   |   12 March 2021 2:30 PM GMT
434 మంది ప్రజాప్రతినిధులు గోడలు దూకేశారా ?
X
ఒకపార్టీ తరపున ఎన్నికై మరోపార్టీలో జంప్ చేసే ప్రజా ప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2016-20 మధ్య దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల్లో కలిపి 434 మంది ఎంఎల్ఏలు, ఎంపిలు, రాజ్యసభ ఎంపిలు తమ పార్టీలను వదిలిపెట్టి వేరే పార్టీల్లోకి దూకేశారు. దేశవ్యాప్తంగా పార్టీల పరిస్ధితులపై అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన లెక్కలు ఆసక్తిగా ఉన్నాయి.

గోడ దూకేసిన వారిలో 405 మంది ఎంఎల్ఏలు, 12 మంది లోక్ సభ సభ్యులు, 17 మంది రాజ్యసభ ఎంపిలున్నారు. పార్టీలు మారిన ఎంఎల్ఏల్లో అత్యధికమంది అంటే 170 మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంటే ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అర్ధమైపోతోంది. ఇతర పార్టీల్లో నుండి 182 మంది ఎంఎల్ఏలు బీజేపీలోకి చేరారు. అంటే బీజేపీ ఫిరాయింపులను ఏ స్ధాయిలో ప్రోత్సహిస్తోందో అర్ధమవుతోంది.

బీజేపీ ప్రోత్సహించిన ఫిరాయింపుల కారణంగానే మధ్యప్రదేశ్, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయాయి. అలాగే అధికారంలోకి రావాల్సిన గోవా, సిక్కిం, మణిపూర్ లాంటి రాష్ట్రంలో ప్రతిపక్షానికే పరిమితమైంది. విచిత్రమేమిటంటే గోడ దూకిన 405 మంది ఎంఎల్ఏల్లో మళ్ళీ ఎన్నికల్లో 209 మంది గెలిచారు. పార్టీ చేరికలకు సంబంధించి తెలుగురాష్ట్రాల్లో టీఆర్ఎస్, టీడీపీలు టాప్ లో ఉన్నాయి.

ఏపిలో వైసీపీ తరపున 2014లో గెలిచిన 23 మంది వైసీపీ ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. అయితే అలా టీడీపీలోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో 2019 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ మాత్రమే గెలిచారు. 2019 ఎన్నికలు కాగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించిన విషయం గుర్తుండే ఉంటుంది.