Begin typing your search above and press return to search.

నివాళి అర్పించేందుకు వెళ్లి త‌న్నుకున్న‌ తంబీలు

By:  Tupaki Desk   |   15 Sep 2017 9:38 AM GMT
నివాళి అర్పించేందుకు వెళ్లి త‌న్నుకున్న‌ తంబీలు
X
అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ప్రారంభ‌మైన త‌మిళ‌నాడు అధికార పార్టీలోని కుంప‌ట్లు ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇన్నాళ్లు పార్టీ ప‌ద‌వుల కోసం, అధికారం కోసం ఈ ర‌చ్చ కొన‌సాగ‌గా...ఇప్పుడు పార్టీతో పాటుగా సంతాప స‌భ‌ల్లోనూ అదే తీరు సాగుతోంది. తాజాగా చెన్నైలోని మెరినా బీచ్ లో ఉద్రిక్తత నెలకొంది. త‌మిళ ప్ర‌ముఖుడు అన్నాదురై జయంతి వేడుకల సందర్భంగా దినకరన్ - దీప వర్గాల మధ్య తోపులాట నెలకొంది.

అన్నాదురై స్మారకం వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ అక్క‌కొడుకు, అన్నాడీఎంకే అసంతృప్త నేత‌ దినకరన్ ను దివంగ‌త సీఎం జయ మేనకోడలు దీప వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో మెరీనా బీచ్ లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.

మ‌రోవైపు అన్నాడీఎంకే పార్టీ చిహ్నం రెండాకుల గుర్తుపై వచ్చే నెల 31లోగా నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. శశికళ - పన్నీర్ సెల్వం వర్గాల మధ్య పార్టీ చిహ్నంపై ఏర్పడిన వివాదంలో ఎన్నికల కమిషన్ మార్చి 23 తాత్కాలిక ఉత్వర్వులు జారీ చేస్తూ అన్నాడీఎంకే చిహ్నమైన రెండాగుల గుర్తును ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉండ‌గా....త‌మిళ‌నాడులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవాలని ఒకవైపు, విపక్షానికి అవకాశం లేకుండా చేయాలని మరొకవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి - ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అందుకు అనుగుణంగా పరిస్థితులను మార్చుకునే పనిలో పడ్డారు. అదేస్థాయిలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షం డీఎంకే - టీటీవీ దినకరన్‌ ఎత్తులు వేస్తున్నారు. అసెంబ్లీని సమావేశ పర్చాలని గవర్నర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. వివరణ కోరుతూ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు - సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు అందుకున్న డీఎంకే శాసనసభ్యులపై ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అనర్హత కత్తి వేలాడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే బాటలోనే టీటీవీ దినకరన్‌ బలపరీక్ష కోరుతూ గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో డీఎంకే పిటిషన్‌ పై గురువారం విచారించించిన హైకోర్టు... ఈ నెల 20వ తేదీ వరకు అసెంబ్లీలో బలపరీక్ష జరపకూడదని ఆదేశాలిచ్చింది.