Begin typing your search above and press return to search.

వెంక‌య్య...మీ సీఎం చేసింది క‌న‌ప‌డుతోందా?

By:  Tupaki Desk   |   25 Jun 2017 4:14 AM GMT
వెంక‌య్య...మీ సీఎం చేసింది క‌న‌ప‌డుతోందా?
X
కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడుకు గ‌ట్టి షాకిచ్చేలా మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్య‌వ‌హ‌రించారు. బీజేపీ అగ్ర‌నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న‌ కేంద్ర‌మంత్రి అయిన వెంక‌య్య‌కు అదే పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి ఎందుకు షాకిచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే క‌దా మీ సందేహం? మీ సందేహంలో నిజ‌ముంది. అయితే ఈ వార్త‌లో కూడా కూడా నిజం ఉంది. ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన‌ ఓ కార్యక్ర‌మంలో వెంక‌య్య మాట్లాడుతూ రైతు రుణ‌మాఫీ ఫ్యాష‌న్ అయిపోయింద‌ని వ్యాఖ్యానించిన‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ముంభై వేదిక‌గా రైతు రుణ‌మాఫీని మ‌హారాష్ట్ర స‌ర్కారు ప్ర‌క‌టించింది. రూ.34వేల కోట్ల రుణం మాఫీ చేసేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ప్ర‌క‌ట‌న వెలువరించింది.

ఒక్కో రైతుకు రూ.1.5 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని, దీంతో దాదాపు 89 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ తెలిపారు. 40 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కలుగుతుందన్నారు. మరాఠా నేత శివాజీ పేరుతో రుణమాఫీ పథకం ప్రవేశపెడుతామన్నారు. రుణాలను క్రమం తప్పకుండా గడువులోపు తిరిగి చెల్లించే రైతులకు ప్రోత్సాహకంగా ఉండటం కోసం... చెల్లించిన రుణంలో 25శాతాన్ని వెనక్కి ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతం ఇవ్వాలని కోరారు. రుణమాఫీ కోసం పొదుపు పాటిస్తామని దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ చెప్పారు.

రాష్ట్రంలో రుణమాఫీ నిర్ణయాన్ని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేకు, ప్రతిపక్షాలకు తెలిపామని మంత్రి పాటిల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా రూ.లక్ష వరకు రుణమాఫీ ఇవ్వాలని కోరిందని పాటిల్ పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని రైతులకు రుణమాఫీ చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇప్ప‌టికే ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను సీఎం ఫడ్నవిస్‌తోపాటు మంత్రి పాటిల్ కలిసి రుణమాఫీ అంశంపై చ‌ర్చించారు.