Begin typing your search above and press return to search.

కేసీఆర్‌-ఓవైసీ మ‌ద్ద‌తిచ్చారు.. మాదే గెలుపు

By:  Tupaki Desk   |   21 April 2018 5:28 AM GMT
కేసీఆర్‌-ఓవైసీ మ‌ద్ద‌తిచ్చారు.. మాదే గెలుపు
X
పొరుగు రాష్ట్రమైన క‌న్న‌డ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. వివిధ స‌ర్వే నివేదిక‌ల ప్ర‌కారం ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ - ప్ర‌తిప‌క్ష‌మైన బీజేపీల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉన్న‌ప్ప‌టికీ...ఈ రెండు జాతీయ పార్టీల‌కు ధీటుగా ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ సైతం బ‌లంగానే ఉంద‌ని...ఇంకా చెప్పాలంటే..ఈ మూడింటిలో వేటికి మెజార్టీ రాదని...హంగ్ ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని ప‌లు ఒపినీయ‌న్ పోల్స్‌ల‌లో అంచ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ మూడ్ గ‌మ‌నించిన వారు సైతం ఇదే భావాన్ని వెల్ల‌డిస్తుండ‌గా....అలాంటిదేమీ లేద‌ని...తామే సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తామ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్తున్నారు మాజీ ప్ర‌ధాని - జేడీఎస్ అధినేత దేవేగౌడ‌.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ శుక్రవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ - బీఎస్పీ అధినేత్రి మాయావతి - ఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలతో పొత్తుతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని ఆయ‌న అన్నారు. `రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు లేవు. కొన్ని సానుకూల అంశాలు జేడీఎస్ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపర్చాయి. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావుకు చెందిన టీఆర్‌ ఎస్ - మాయావతికి చెందిన బీఎస్పీ - ఎంఐఎంలతో మా కలయిక అద్భుత ఫలితాలను ఇవ్వనుంది`. అంటూ దేవెగౌడ ధీమా వ్య‌క్తం చేశారు.

కర్ణాటకలో ఇప్పటివరకు ఏర్పడిన ప్రభుత్వాల్లో సిద్దరామయ్యదే అత్యంత అవినీతిమయ ప్రభుత్వమని దేవెగౌడ ధ్వజమెత్తారు. `నాయ‌కుడు తాను పోటీచేసిన నియోజకవర్గ బాగోగులు చూసుకోవాలి. కానీ సిద్దరామయ్య కేవలం మూడునెలల నుంచే చాముండేశ్వరికి వెళ్తున్నారు. అక్కడ ఓటమి తప్పదని ఆయన ముఖంలోనే కనిపిస్తోంది. సమాజాన్ని ఏకతాటిపై నిలిపే నేతకే ప్రజలు ఓటేస్తారు. విభజించి పాలించే వారికి ఓటమి తప్పదు. లింగాయత్‌లకు, వీరశైవ లింగాయత్‌ల కు మతపరమైన మైనార్టీ హోదాను ప్రతిపాదించి సమాజాన్ని చీల్చాలని ప్రయత్నిస్తున్నారు. రెండు స్థానాల్లో పోటీచేస్తున్న సిద్దరామయ్యపై ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడింది` అని దేవెగౌడ తెలిపారు. తాము ప్ర‌భుత్వాన్ని సొంతంగా ఏర్పాటుచేస్తామ‌ని, ఈ నేప‌థ్యంలో పొత్తు పెట్టుకోవ‌డం ఊహ‌జ‌నిత నిర్ణ‌య‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.