Begin typing your search above and press return to search.

విస్తరిస్తున్న డెంగీ .. ప్లేట్‌లెట్స్‌ తగ్గితే వెంటనే ఏంచేయాలి ?

By:  Tupaki Desk   |   30 Aug 2021 7:40 AM GMT
విస్తరిస్తున్న డెంగీ .. ప్లేట్‌లెట్స్‌ తగ్గితే వెంటనే ఏంచేయాలి ?
X
డెంగ్యూ.. రోజురోజుకీ విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికే ఈ జ్వరాన పడి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చాలా మంది మంచానికి పరిమితం అయ్యారు. కరోనా కాలంలో రోగ నిరోధక శక్తి అసలే అంతంత మాత్రంగా ఉంటోంది. దీనికి తోడు ఇలాంటి జ్వరాలు ప్రబలాయంటే ఇక అంతే సంగతులు. సీజనల్ వ్యాధి అయిన డెంగీ కూడా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు ముందుగా కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మిగతా జ్వరాలు ఉన్నప్పుడు వాటి తాలూకూ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ, డెంగ్యూ జ్వరం వస్తే.. ఆ లక్షణాలు ఏవీ కనిపించవు. బాడీ పెయిన్స్ ఉండవు. కానీ, లోలోపలే, వ్యాధి తీవ్రత ఎక్కువై పోతుంది. ప్లేట్‌ లెట్స్ తగ్గిపోతాయి. ఈ కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

సమస్య వచ్చిందని వారికి తెలిసేలోగా ప్రాణాల మీదకు వచ్చి పడింది. కాబట్టి ఎప్పటికప్పుడూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. డెంగ్యూ ఎక్కువగా వయసు ఎక్కువగా ఉన్నవారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకి, చిన్నపిల్లలకి ఎ క్కువగా వస్తుంటుంది. వీరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వ్యాధి వారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డెంగ్యూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఎక్కువగా అటాక్ చేస్తుంది. విస్తరిస్తుంది. కాబట్టి ఈ మాసాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక జ్వరం వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.

డెంగీ వస్తే ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య బాగా తగ్గిపోవచ్చు. ప్లేట్‌ లెట్స్‌ తగ్గినప్పుడు బాధితుడికి రక్తస్రావం లేదా దేహంలోనే అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్లేట్‌ లెట్స్‌ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం. సాధారణంగా ప్లేట్‌ లెట్ల సంఖ్య నాలుగు లక్షల నుంచి 80,000 వరకు పడిపోయినా ఎలాంటి ఆపద రాదు. కానీ అవి 20,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు బాధితుడు ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు ఏ చిన్నపాటి గాయమైనా అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అప్పుడు ప్లేట్‌ లెట్స్‌ను ఎక్కించడం అవసరమవుతుంది. చూడ్డానికి రక్తమంతా ఒకే ద్రవంలా కనిపిస్తుంటుందిగానీ.. అందులో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌ లెట్స్, ప్లాస్మాతో పాటు చాలా ప్రోటీన్లు వంటి అంశాలుంటాయన్నది తెలిసిందే. అందులో ప్లేట్‌లెట్లు కూడా చాలా కీలకమైనవే.

బ్లడ్‌ బ్యాంకుల్లో అనేక మంది దాతలు ఇచ్చిన రక్తాన్ని సేకరిస్తుంటారు. ఇందులోంచి రక్తంలో ఉండే ప్రధానమైన మూడు రకాల అంశాలను వేరుచేస్తారు. అంటే ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌ లెట్స్‌ను విడదీసి వేటికవి ప్యాక్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల, రక్తహీనత మాత్రమే ఉన్న రోగులకు ఎర్రరక్తకణాలు ఎక్కించడం, ప్లాస్మా మాత్రమే అవసరమైన రోగులకు దాన్ని ఇవ్వడం, ప్లేట్‌ లెట్స్‌ తగ్గినవారికి అవి మాత్రమే ఇవ్వడం ద్వారా ఒకే యూనిట్‌ బ్లడ్‌ తో ముగ్గురికి ప్రాణాపాయం తప్పించవచ్చు. వైద్యరంగంలో ఇప్పుడున్న ఆధునిక సాంకేతికత సహాయంతో ఒక్క దాత నుంచే అవసరమైన పరిమాణంలో ప్లేట్‌ లెట్స్‌ సేకరించవచ్చు. ఇలా చేసేప్పుడు రక్తంలోని ఇతర అంశాలను కాకుండా కేవలం ప్లేట్‌ లెట్స్‌ మాత్రమే సేకరిస్తారు. ఇలా సేకరించేవాటిని సింగిల్‌ డోనార్‌ ప్లేట్‌ లెట్స్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఒకే దాత, బాధితుడికి అవసరమైనన్ని అంటే, దాదాపు 30,000 ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ సమకూరేలా వాటిని దానం చేస్తాడు. దానివల్ల దాతకు ఎలాంటి నష్టమూ ఉండదు. కేవలం నాలుగురోజుల్లోనే దాత రక్తంలోకి అవి తిరిగి భర్తీ అవుతాయి.

ప్లేట్‌ లెట్స్‌ ఎముక మూలుగ నుంచి పుడతాయి. వీటి జీవిత కాలం కేవలం నాలుగు రోజులు మాత్రమే. సాధారణంగా ఎముక మూలుగలో ఏదైనా సమస్య వస్తే ప్లేట్‌ లెట్స్‌ ఉత్పత్తి తగ్గుతుంది. రక్తంలో వీటి సంఖ్య తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టే మన స్వాభావిక రక్షణ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తిలో క్యూబిక్‌ మిల్లీమీటర్‌ పరిమాణంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్‌ ఉండాలి. ఇది నార్మల్‌ కొలత. వీటి సంఖ్యను ‘సెల్‌ కౌల్టర్‌ మెషిన్‌’ అనే యంత్రం ద్వారా కొలుస్తారు. ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ కోసం 2 – 3 ఎమ్‌ ఎల్‌ రక్తాన్ని సేకరిస్తారు. డెంగీవ్యాధిగ్రస్తుల్లో ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ తెలుసుకోవడం కోసం ప్రతి 24 గంటలకోమారు రక్తపరీక్ష నిర్వహిస్తుండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది. కాబట్టి ముందు వాటిని తరిమేయాలి.ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి, చీకటి పడగానే తలుపులు, కిటికీలు వేసుకోవాలి.చుట్టుపక్కలా నీటి గుంటలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలి.పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని కవర్ చేసుకోవాలి.ఒంటికి వేప నూనె రాయాలి. కేవలం అది మాత్రమే రాసుకోవడం ఇబ్బందిగా అనిపించి వాసనగా అనిపిస్తే కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు.

చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో వడం వల్ల ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు. దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.

బయటి ఆహారం తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ తీసుకోవద్దు. బయటి ఫుడ్ శుభ్రత లేకుండా తయారు చేస్తుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.వండిన ఆహార పదార్థాలపై ఎప్పటిప్పుడూ మూతలు పెట్టాలి.వీలైనంత వరకూ తాజాగా వండుకున్న ఆహారాన్నే తీసుకోవాలి.ఈ సమయంలో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. తాజాగా వండుకోవడం మంచిది. సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.