Begin typing your search above and press return to search.

భద్రాద్రి రాములోరు ఏపీలోకి వచ్చేస్తారా?

By:  Tupaki Desk   |   5 Jun 2019 3:39 PM GMT
భద్రాద్రి రాములోరు ఏపీలోకి వచ్చేస్తారా?
X
నిజమేనండోయ్... ఇప్పుడు భద్రాద్రి రాములోరి గుడి ఉన్న భద్రాచలం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అవుతుందా? అన్న అంశంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడం - ఆ రెండు ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడం, ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం మొదలవడం తదితరాలను చూస్తుంటే... నిజంగానే ఈ చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ డిమాండ్ల పట్ల ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా సానుకూల ధృక్పథంతో ముందుకు సాగుతుంటే... అదే సమయంలో తెలంగాణకు రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కూడా అదే స్థాయిలో సానుకూలంగా స్పందిస్తున్నారు.

జగన్ సీఎంగా కాగానే అప్పటిదాకా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు - విభేదాలు అన్నీ తొలగిపోయాయి. ఒక్క భేటీతోనే తెలంగాణ సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ కూడా తెలంగాణకు బదిలీ అయిపోయాయి. ఇప్పుడు అదే రీతిన ఇరు రాష్ట్రాల మధ్య సమస్యగా మారిన మరిన్ని అంశాలు కూడా పరిష్కారం అవుతాయని అనుకుంటాం కదా. ఆ క్రమంలోనే ఇప్పుడు భద్రాచలం కూడా ఏపీకి వెళ్లిపోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే ఆ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీకి బదలాయించాలన్న డిమాండ్ మేరకు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీకి బదిలీ అయిపోయాయి. అయితే భద్రాచలానికి కూడా పోలవరం ముంపు ప్రమాదం ఉందన్న భావన నాడే వ్యక్తమైనా... భద్రాచలాన్ని వదులుకోవడానికి కేసీఆర్ ఒప్పుకోలేదు.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణ చోటుచేసుకుంది కదా. భవిష్యత్తులో పోలవరం ముంపు కారణంగా భద్రాచలానికి ఇబ్బంది ఏర్పడితే... అది ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తుంది కదా. మరి అలాంటి ఉపద్రవం రాకుండా ఇప్పుడు చర్యలు చేపడితే సరిపోతుంది కదా. ఇదే భావనతో అక్కడి గిరిజనులు భద్రాచలాన్ని ఏపీలో కలిపేయాలని డిమాండ్ మొదలెట్టారు. ఈ డిమాండ్ అంతకంతకూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు మండలాలను ఏపీకి బదలాయించేందుకు సరేనన్న కేసీఆర్... ఇప్పుడు గిరిజనుల డిమాండ్లు, భవిష్యత్తు సమస్యలను ప్రస్తావిస్తూ భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చేయాలని జగన్ అడిగితే... కేసీఆర్ ఏమంటారన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారిపోయింది. చూద్దాం... మరి ఏం జరుగుతుందో?