Begin typing your search above and press return to search.

అమృత ఎపిసోడ్ పై నోరు విప్ప‌ని అన్నాచెల్లెళ్లు

By:  Tupaki Desk   |   3 Sep 2017 5:13 AM GMT
అమృత ఎపిసోడ్ పై నోరు విప్ప‌ని అన్నాచెల్లెళ్లు
X
సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన త‌మిళ‌నాడులో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. అమ్మ అనారోగ్యానికి ముందు.. ఆ త‌ర్వాత అంటూ రెండు భాగాలుగా చూస్తే.. అమ్మ లేని లోటు ఎంత‌ ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. త‌న క‌నుసైగ‌తో అంత పెద్ద అన్నాడీఎంకేను న‌డిపిన అమ్మ‌.. త‌ర్వాతి కాలంలో ఆమె లేని త‌ర్వాత ముక్క‌లు చెక్కలుగా మారిపోవ‌టం క‌నిపిస్తుంది.

ఓప‌క్క అధికార అన్నాడీఎంకే పార్టీలో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఒక కొలిక్కి రాని ప‌రిస్థితి. మ‌రోవైపు.. అమ్మ ఆస్తులు త‌మ‌కే చెందుతాయంటూ అమ్మ మేన‌ల్లుడు.. మేన‌కోడ‌లైన దీప‌.. దీప‌క్ ఇద్ద‌రూ పోటాపోటీగా ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తున్నారు. అమ్మ ఆస్తుల‌కు తామే వార‌సుల‌మ‌ని చెబుతున్నారు.

ఇలాంటివేళ‌.. అమృత అనే మ‌హిళ తెర మీద‌కు వ‌చ్చారు. తాను జ‌య‌ల‌లిత కుమార్తెగా చెప్ప‌టం సంచ‌ల‌నంగా మారింది. నిజానికి ఇది పాత విష‌యం కూడా. త‌న త‌ల్లి జ‌య‌ల‌లిత‌.. శోభ‌న్ బాబుల ప్రేమ‌కు గుర్తుగా పుట్టిన‌దానినంటూ చెప్ప‌ట‌మే కాదు.. అమ్మ‌కు సోద‌రి అయ్యే శైల‌జ దంప‌తుల‌కు కుమార్తెగా పెరిగారు. తాను జ‌య‌ల‌లిత ర‌క్తం పంచుకున్న బిడ్డ‌న‌ని.. కావాలంటే డీఎన్ ఏ ప‌రీక్ష చేయ‌మ‌ని స‌వాలు విసురుతున్నారు.

ఊహించ‌నిరీతిలో తెర మీద‌కు వ‌చ్చిన ఈ ప‌రిణామంపై అన్నాడీఎంకే వ‌ర్గాలు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. అమ్మ ఇమేజ్ మొత్తంగా దెబ్బ తీసే ఈ ఎపిసోడ్‌ ను ఎలా అధిగ‌మించాల‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అయితే.. ఈ అమృత‌కు సంబంధించి కొత్త విష‌యాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

తాను పుట్టిన వెంట‌నే ఇచ్చేశార‌ని చెబుతుంటే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆమె బ‌ర్త్ స‌ర్టిఫికేట్ల‌లో మాత్రం ఆమె అమెరికాలో పుట్టిన‌ట్లుగా ఉంద‌ని చెబుతున్నారు. కీల‌క‌మైన అంశం ఏమిటంటే.. అమృత పుట్టేనాటికి శైల‌జ దంప‌తులు అమెరికాకు వెళ్ల‌లేద‌న్న మాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి.. అలాంట‌ప్పుడు ఆమెకు అమెరికా బ‌ర్త్ స‌ర్టిఫికేట్ ఎలా వ‌చ్చింద‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌గా మారింది.

ఇంత‌కీ అమృత పెరిగిన శైల‌జ ఎవ‌ర‌న్న విష‌యానికి వెళితే.. జ‌య‌ల‌లిత ఫ్యామిలీ లోతుల్లోకి వెళితే కానీ అర్థం కాదు. తిరుచ్చి జిల్లా శ్రీరంగానికి చెందిన జ‌య‌ల‌లిత తాత రంగ‌స్వామి అయ్యంగార్‌. ఆయ‌న మైసూర్ లో ప‌ని చేశారు. ఆయ‌న‌కు ఒక కొడుకు ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు ఎవ‌రంటే అంబుజ‌వ‌ల్లి.. వేద‌వ‌ల్లి.. ప‌ద్మ‌వ‌ల్లి. ఈ ముగ్గురిలో అంబుజ‌వ‌ల్లి కుమార్తె శైల‌జ‌గా చెబుతున్నారు. అంటే.. జ‌య పెద్ద‌మ్మ కుమార్తెగా శైల‌జ‌ను చెప్పాలి. ఆమె కుమార్తెగా అమృత పెరిగార‌న్న‌ది ఇప్పుడు చెబుతున్న‌ది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమ్మ ఆస్తుల కోసం రోడ్డు మీద‌కు వ‌చ్చిన అన్నాచెల్లెళ్లు.. దీప‌క్‌.. దీప‌లు ఇద్ద‌రూ కూడా అమృత అంశం మీద పెద‌వి విప్ప‌క‌పోవ‌టం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. తాను జ‌య‌ల‌లిత కుమార్తెగా చెబుతున్న ఆమె మాట‌ను అన్నాచెల్లెళ్లు ఖండించ‌క‌పోవ‌టం చూస్తే.. లోగుట్టు ఏదైనా ఉందా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.