Begin typing your search above and press return to search.

భార‌త్‌ కు గుడ్ న్యూస్‌ చెప్పిన బ్రిట‌న్ ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   12 Nov 2015 4:35 PM GMT
భార‌త్‌ కు గుడ్ న్యూస్‌ చెప్పిన బ్రిట‌న్ ప్ర‌ధాని
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తొలిరోజు అద్భుత‌మైన హామీ ద‌క్కింది. చిరకాలంగా భార‌త్ ఎదురుచూస్తున్న కోరిక నెర‌వేరేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని బ్రిట‌న్‌ హామీ ఇచ్చింది. ఈ మేర‌కు ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి డేవిడ్ కామెరున్ బ్రిట‌న్ ప్ర‌జ‌లు, ఉన్న‌తాధికారుల స‌మ‌క్షంలో స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు.

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ - బ్రిట‌న్ ప్ర‌ధాని డేవిడ్ కామెరున్‌ ల స‌మావేశం అనంత‌రం మోడీ - కామెరున్‌ లు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా డేవిడ్‌ కామెరూన్ ప్ర‌సంగిస్తూ... ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా ఈ విష‌యం చెప్పిన‌ట్లు కామెరూన్ ప్ర‌స్తావించారు. భారత్‌ - బ్రిటన్‌ సంబంధాలు కాల పరీక్షకు నిలబడ్డాయని అన్నారు. భారత్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటీష్‌ సంస్థలు - ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్‌ ప్రధాని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పునర్‌ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియా - డిజిటల్‌ ఇండియా - స్మార్ట్‌ సిటీస్‌ - స్వచ్ఛ భారత్‌ లో బ్రిటన్‌ భాగస్వామ్యమవుతుందని తెలిపారు. అనేక రంగాల్లో తాము చేసిన నిర్ణయాలు భవిష్యత్తును నిర్థారిస్తాయని పేర్కొన్నారు. భార‌త్‌ తో భ‌విష్య‌త్ సంబంధాల కోసం ఆ దేశానికి ఉప‌యోగ‌ప‌డే విష‌యాల్లో తాము పూర్తిగా స‌హాయ‌ - స‌హ‌కారాలు అందిస్తామ‌ని తెలిపారు.