Begin typing your search above and press return to search.

కూతురి కోసం చిరుతతో పోరాడిన అమ్మ ..!

By:  Tupaki Desk   |   19 July 2021 7:33 AM GMT
కూతురి కోసం చిరుతతో పోరాడిన అమ్మ ..!
X
కన్న బిడ్డపై తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేం. ఎందుకంటే, అది అనంతం కాబట్టి మరి, అటువంటి బిడ్డను ఒక చిరుత పులి ఈడ్చుకుపోతున్న సంఘటన తన కళ్ల ముందే జరుగుతుంటే ఆ తల్లి తట్టుకోలేకపోయింది.ఆ కాళికా దేవిలా మారిపోయింది. చిరుత పై దాడి చేసి తన బిడ్డను రక్షించుకున్న ఆ వీరమాత గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే .. చంద్రపుర్‌ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునోనా గ్రామానికి చెందిన అర్చన ఈ నెల 3న బహిర్భూమికి తన ఇంటి దగ్గర ఉన్న అడవి లోకి వెళ్లింది. అర్చన తో పాటు ఐదు సంవత్సరాల ఆమె బిడ్డ ప్రజాక్త కూడా అడవిలోకి వెళ్లింది. కొంచెం దూరం అలా వాళ్లిన తర్వాత వారిద్దరు ఆ అడవిలో విడిపోయారు. బిడ్డా అరుపులు వినపడి పరుగున వచ్చిన తల్లికి అక్కడ ఘటన చూసి నోటి నుంచి మాట రాలేదు. కూతురి తల మొత్తం ఓ చిరుత పులి నోట్లో ఉంది. అది చిన్నారిని లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తోంది. చిరుతను చూసిన మహిళ మొదట భయంతో వణికిపోయింది.

కానీ, తన బిడ్డ ప్రాణాపాయంలో ఉండటంతో ధైర్యం తెచ్చుకుంది. వెంటనే తేరుకున్న అర్చన చిరుతపులి వెంట పడింది. పక్కనే ఉన్న ఓ వెదురు కర్రను తీసుకుని ఆ చిరుత పై పోరాటం మొదలుపెట్టింది. నోట కరుచుకున్న బాలికను వదలేవరకు ఆ తల్లి చిరుతను చితక్కొట్టింది. వెదురు కర్రతో దాని తోకపై కూడా కొట్టసాగింది. మహిళ దాడికి బెదిరిపోయిన చిరుత పులి.. ఆ చిన్నారి తలను వదిలి నడుము భాగాన్ని పట్టుకుంది. అర్చన మరో దెబ్బ వేయటంతో ఈసారి ప్రజాక్తను విడిచి, ఆమెపైకి రావటానికి ప్రయత్నించింది. ఆమె భయపడకుండా దాన్ని కొట్టడానికి ప్రయత్నించింది. చిరుత చేసేదేమీ లేక అక్కడినుంచి పరారైంది. అయితే, చిరుత దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలపాలైన కూతుర్ని ఎత్తుకుని ఇంటికి పరిగెత్తుతుండగా, ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు బాధిత బాలికను చంద్రపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిరుతపులి దాడిలో చిన్నారి పై, కింద దవడ ఎముకలు విరిగి, పక్కకు జరిగాయి. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మూతి భాగాన్ని సరిచేయటానికి సోమవారం పూర్తి స్థాయి శస్త్ర చికిత్స చేయనున్నారు. చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును అటవీశాఖ తరఫున అందజేస్తున్నారు. కాగా, ఈ ఘటన జూన్ 30వ తేదీన చోటు చేసుకోగా.. తాజాగా అధికారులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై తల్లి అర్చన మాట్లాడుతూ ఆ రోజు జరిగిన ఘటన ఇప్పటికీ తన కళ్ల ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుందని తెలిపింది. కళ్లు మూసుకుంటే అదే ఘటన గుర్తుకు వస్తుందని చెప్పింది. ఇప్పుడిప్పుడే ఆ సంఘటన నుంచి బయటపడుతున్నట్లు అన్నారు. బిడ్డను కాపాడే ప్రయత్నంలో తనపై కూడా చిరుత దాడి చేసేందుకు ప్రయత్నించిందని అయినా ధైర్యం కోల్పోకుండా తన బిడ్డను కాపాడుకోగలిగానని ఆమె చెప్పుకొచ్చింది.