Begin typing your search above and press return to search.

బద్వేలు బై పోల్ : వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ !

By:  Tupaki Desk   |   28 Sep 2021 9:45 AM GMT
బద్వేలు బై పోల్ : వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ !
X
కడప: కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలను అధికార వైసీపీ, విపక్ష టీడీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. 2019 ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య పోటీ చేసి విజయం సాధించారు. అయితే అనారోగ్య కారణాలతో వెంకట సుబ్బయ్య ఇటీవల మరణించారు. బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను ఆ పార్టీ బరిలోకి దింపుతుంది. టీడీపీ అభ్యర్ధిగా ఓబులాపురం రాజశేఖర్ ను బరిలోకి దింపుతుంది. టీడీపీ అభ్యర్ధి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

బద్వేలు ఉపఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీచేస్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బద్వేల్ ఉపఎన్నిక విషయంలో ఇప్పటికే వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం చెప్పినట్టు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్‌ ఇవ్వడం మా సంప్రదాయమ‌ని తెలిపారు. సానుభూతిగా మిగిలిన పార్టీల‌వారు పోటీలో ఉండకపోవడం సాంప్రదాయమ‌ని, ఒకవేళ పోటీలో ఉంచినా ఎంత సీరియస్‌ గా తీసుకోవాలో అంతే తీసుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు.

ఇక‌ ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీకి అభిమానం పెరుగుతోందని, ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకి ఎప్పుడూ ఉంటాయని అన్నారు. నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామ‌ని ఉపఎన్నికను సీరియస్‌ గా తీసుకుని, మంచి మెజార్టీతో గెలుస్తామని సజ్జల పేర్కొన్నారు. ఇదిలావుంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై స‌జ్జ‌ల స్పందించారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బందని అన్నారు. ఆయనను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారని విమ‌ర్శించారు.

పవన్ కళ్యాణ్.. సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారని, పవన్ క‌ళ్యాణ్‌ లాంటి వారితో ఇబ్బంది పడతామని సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద‌లే భావిస్తున్నారని అన్నారు. ఆన్‌ లైన్ టికెటింగ్‌ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారని, ఈ విధానంతో పారదర్శకత సాధ్యమ‌ని స్ప‌ష్టం చేశారు. సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసున‌ని, సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమేన‌ని సజ్జల అన్నారు. పవన్‌ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు.

నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదు. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద జనరల్ ఎన్నికలుగా తీసుకున్నారు. రూ.100 కోట్ల వరకు పంచారు. పథకాలు ఆగిపోతాయని భయపెడితే ఆ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలు మా ప్రభుత్వం గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశం. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మాకూ అవసరం. మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చు అని సజ్జల అన్నారు.

బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. అయితే కొంత కాలంగా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ పట్టుకోల్పోతుంది. బిజివేముల వీరారెడ్డి ఈ స్థానం నుండి వరుసగా విజయాలు సాధించారు. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కూతురు ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. బద్వేల్ అసెంబ్లీ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయింది. కొన్ని ఏళ్లుగా ఈ స్థానంలో టీడీపీ ఉనికి కోసం పోరాటం చేస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నామమాత్రంగానే విజయాలను నమోదు చేసింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరమని ప్రకటించింది. ఈ స్థానం నుండి బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్ధిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.