Begin typing your search above and press return to search.

తెలంగాణలో కరోనా మరణాలు దాస్తున్నారా?

By:  Tupaki Desk   |   30 July 2020 11:45 AM IST
తెలంగాణలో కరోనా మరణాలు దాస్తున్నారా?
X
కరోనా ఆరోగ్యవంతులను ఏమీ చేయడం లేదని తేలింది. ఇతర వ్యాధులైన షుగర్, బీపీ, ధీర్ఘకాలిక వ్యాధులున్న వారిని మాత్రం కబళిస్తోందని ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాల్లో నిరూపితమైంది.

అయితే తెలంగాణ బులిటెన్ చూశాక మాత్రం ట్రెయిన్ రివర్స్ లో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 41 రోజులుగా రాష్ట్రంలో పూర్తి ఆరోగ్యవంతులే కరోనాతో ఎక్కువగా చనిపోయారని రిపోర్టులో బహిర్గతమైంది. ఇతర వ్యాధులున్నవారు తక్కువగా చనిపోతున్నారు.

జూన్ 18నుంచి జూలై్ 28వరకు గత 41 రోజుల్లో తెలంగాణలో కరోనా వల్ల 300 మంది చనిపోయారు. వీరిలో 192మంది (64శాతం) ఇతర వ్యాధులేవి లేని పూర్తి ఆరోగ్యవంతులు కావడం గమనార్హం. మృతుల్లో 108మంది (36శాతం) మంది మాత్రమే ఇతర వ్యాధులుండి చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో ఒక తీరు ఉంటే.. తెలంగాణలో మాత్రం మరో రకంగా ఆరోగ్యవంతులే చనిపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర వ్యాధులున్నవారే కరోనాతో చనిపోతుండగా.. తెలంగాణలో మాత్రం పూర్తి భిన్నమైన గణాంకాలు సర్కార్ విడుదల చేయడం గమనార్హం.

ఇక తెలంగాణ సర్కార్ మృతదేహాల లెక్కలను దాస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఎర్రగడ్డలో రోజుకు 50మందికి దహన సంస్కారాలు చేస్తూ బులిటెన్ లో మాత్రం కరోనా మృతులను 10కి మించకుండా వేస్తుండడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తంగా తెలంగాణ బులిటెన్ లో ఏదో మతలబు ఉందన్న అనుమానాలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి.