Begin typing your search above and press return to search.

వార్నింగ్‌..నేను మ‌న‌సు పెడితే తట్టుకోలేవు

By:  Tupaki Desk   |   21 July 2017 7:26 AM GMT
వార్నింగ్‌..నేను మ‌న‌సు పెడితే తట్టుకోలేవు
X
రాజ‌కీయాల్లో అధికార‌ - ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శ‌లు - ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌హ‌జం. అయితే ఇది కాస్త ప‌రిధి దాటి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు...బెదిరింపుల స్థాయికి చేరిపోయింది. తాజాగా వైసీపీ ప్ర‌కాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిపై తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు - ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌ మాట్లాడుతూ తనపై బాలినేని వ్యక్తిగతంగా విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశంపార్టీలో ఎవరో చెప్పారని అవినీతికి తాను పాల్పడుతున్నట్లు బాలినేని మాట్లాడటం దుర్మార్గమన్నారు. వ్యక్తిగతంగా తాను ఎవరిని ఇబ్బందిపెట్టలేదన్నారు. కమీషన్లకుకక్కుర్తిపడే నైజం తనదికాదని ఆ నైజం బాలినేనిదేన‌ని ఆరోపించారు.

కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తే తాను ఇల్లు కట్టుకుంటున్నానని బాలినేని మాట్లాడటం విడ్డూరంగా ఉందని జ‌నార్దన్ అన్నారు. తాను పుట్టకతోనే శ్రీమంతుడినని పదిమందికి అన్నంపెట్టే కుటుంబం తమదన్నారు. నాలుగుసార్లు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యామని ఒక్క అవినీతినైనా నిరూపించాలని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా తనపై విమర్శలు చేస్తే బాలినేని బండారం బయటపెడ్తానని హెచ్చ‌రించారు. తాను పూర్తిగా మనసుపెడితే తట్టుకోలేవని జ‌నార్ద‌న్ అన్నారు. అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని బాలినేనికి సూచించారు. ఆయ‌న‌ తప్పులన్ని తనకు తెలుసునని ఒక్కపని కూడా చెప్పుకునేందుకు బాలినేనికి అవకాశం లేదన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని.... ఓడిపోయేవారే బాధపడాలన్నారు. కనీసం బాలినేని ఎక్కడ ఉంటాడో తనకే తెలియదని, అమావాస్యకు, సంవత్సరానికి ఒకసారి ఒంగోలుకు వచ్చే బాలినేని తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయటం అర్ధరహితమని జ‌నార్ద‌న్ అన్నారు.

నాలుగుసార్లు శాసనసభ్యునిగా గెలిచిన బాలినేని ఒంగోలు నియోజకవర్గంలో ఏ ఒక్కపని చేయలేదని న్నారు. నాలుగుసంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని తాను మూడుసంవత్సరాల్లో ఒంగోలు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని జ‌నార్ద‌న్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే రామతీర్ధం, గుండ్లకమ్మప్రాజెక్టుల పనులు ప్రారంభం అయ్యాయని, వెలుగొండప్రాజెక్టుకు పునాది వేశారన్నారు. తాను చేసిన అభివృద్ధి, బాలినేని అవినీతిపై రెండు పార్టీల సీనియర్ నాయకుల సమక్షంలో ప్రజాకోర్టులో తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ విసిరారు. డివిజన్ల వారికి ఏన్ని అభివృద్ది కార్యక్రమాలను చేపట్టానో పరిశీలించుకోవాలన్నారు. గ్రానైట్, పొగాకు పంటకు జిఎస్‌ టి లేకుండా చేసేవిధంగా ప్రధానితో ముఖ్యమంత్రి మాట్లాడతామన్నారు. అతి త్వరలో యరజర్లలో ట్రిపుల్ ఐటికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. త్వరలో జీప్లస్ 9 తరహాలో ఏడువేలమందికి పైగా గృహాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.