Begin typing your search above and press return to search.

‘దళితుల’పై కేసీఆర్ ప్లాన్లు సక్సెస్ అవుతాయా?

By:  Tupaki Desk   |   12 Aug 2021 4:20 AM GMT
‘దళితుల’పై కేసీఆర్ ప్లాన్లు సక్సెస్ అవుతాయా?
X
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదిపారు. తాజాగా మరో వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ‘దళితబంధు’ పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని అనుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు.

దళితబంధు పథకానికి చైర్మన్ గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సబంధించి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేశారు. కానీ ఇంకా టీఆర్ఎస్ లో చేరలేదు. కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ‘దళితబంధు’ ప్రకటన తర్వాత విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సవాళ్లు విసరుతుతున్నారు. ఈ క్రమంలోనే దళితులకు కేబినెట్ లో చోటుతోపాటు దళితబంధుకు చట్టబద్దత తీసుకువచ్చి వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారని.. ఈ క్రమంలోనే బలమైన వాయిస్ వినిపించే మోత్కుపల్లిని ఈ పథకం చైర్మన్ గా చేసి విమర్శలు గుప్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే కేబినెట్ లో మార్పులు జరగవచ్చని వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఈటల రాజేందర్ తొలగింపు ఒక ఖాళీ ఉంది. మొత్తం 17 మంది ఎస్సీ కోటా మాల సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. ఎస్సీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలోనే మాదిగ సామాజికవర్గానికి ప్రాధాన్యత పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ శాసనసభలో ఎస్సీ కేటగిరిలో 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 18 మంది టీఆర్ఎస్ నుంచే గెలిచారు. ఇందులో 8మంది మాల, 9 మంది మాదిగ సామాజికవర్గం. తాజా విస్తరణలో కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ లోకి ప్రధానంగా మాదిగ వర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకటవీరయ్యల పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. కేసీఆర్ ఫిల్టర్ చేస్తున్నారని చెబుతున్నారు.ౌ

తెలంగాణలో చురుకుగా మారిన ప్రతిపక్షాలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీన్మార్ మల్లన్న వంటి కొత్త రాజకీయ శక్తులు కూడా వివిధ సమస్యలపై ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో వీరందరికీ కళ్లెం వేసేందుకు కేసీఆర్ ఇప్పటికే ప్రత్యేక వ్యూహం రూపొందించారని.. అందుకోసం ఇద్దరూ మాదిగ మంత్రులు, ‘దళితబంధు’ చైర్మన్ పదవిని ఇచ్చి వారిని అణచాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ‘దళితబంధు’ అవగాహన పేరుతో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా భారీ సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలపైన కసరత్తు చేస్తున్నట్టు తాజా సమాచారం. తద్వారా విపక్షాల పాదయాత్రలు, సభలు, ఆందోళనలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది.

దళితులను టార్గెట్ గా చేసుకొని ఉద్యమిస్తున్న రాజకీయ శక్తులను ఆత్మరక్షణలోకి నెట్టేలా దళితబంధు చైర్మన్, ఎస్సీలకు మంత్రి పదవులు వంటి కొత్త అస్త్రాలను సీఎం కేసీఆర్ తెరపైకి తెస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎస్సీల్లో ఒకరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను, దళితులను పట్టించుకోవడం లేదనే అపవాదును తొలగించేలా సీఎం కేసీఆర్ ఈ ప్లాన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దళితబంధు విషయంలో కేసీఆర్ అడుగులు సక్సెస్ అవుతాయా? లేదా ? అన్నది వేచిచూడాలి.