Begin typing your search above and press return to search.

మ‌రో నాలుగు మండ‌లాల‌కు ద‌ళిత బంధు

By:  Tupaki Desk   |   2 Sep 2021 3:31 AM GMT
మ‌రో నాలుగు మండ‌లాల‌కు ద‌ళిత బంధు
X
కేసీఆర్ స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న ద‌ళిత బంధు ప‌థ‌కం మ‌రో నాలుగు మండ‌లాల‌కు విస్త‌రించింది. ఈ మేర‌కు బుధ‌వారం తెలంగాణ స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో గెలుపు కోస‌మే ద‌ళిత బంధును ప్ర‌వేశ‌పెట్టార‌న్న విమ‌ర్శ‌ల‌ను ఎంత‌మాత్రం ప‌ట్టించుకోని కేసీఆర్ స‌ర్కారు.. ఆ ప‌థ‌కాన్ని హుజూరాబాద్ లోనే పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద ఒక్కో ద‌ళిత కుటుంబానికి ఏకంగా రూ.10 ల‌క్ష‌ల‌ను అందిస్తారు. ఆ నిధుల‌తో ఆయా కుటుంబాలు త‌మ జీవనాన్ని మెరుగుప‌ర‌చుకునే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు ర‌రించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోస‌మే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నార‌న్న మాట అబ‌ద్ధ‌మ‌ని చెప్పే దిశ‌గానే మ‌రో నాలుగు మండలాల‌కు ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింపజేస్తూ కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ద‌ళిత బంధు విస్త‌ర‌ణ కోసం కేసీఆర్ స‌ర్కారు రచించుకున్న వ్యూహం కూడా విమ‌ర్శ‌ల‌ను చెక్ పెట్టేదిగానే ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని నాలుగు వైపులా ఉండే నాలుగు జిల్లాల్లో ఒక్కో మండలంలో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని మండలాలనే ఎంపిక చేశారు. అయితే ఇలా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మండలం కూడా ఉంది. మధిర నియోజకవర్గం: చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలంలో రైతు బంధును అమలు చేస్తారు.

కొత్త‌గా ఎంపిక చేసిన మండ‌లాల్లో కూడా హుజురాబాద్‌తో సమాంతరంగా ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హుల్ని ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నాలుగు నియోజకవర్గాలు తెలంగాణలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీలో కార్యాలయ శంకుస్థాపన కోసం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి వస్తారు. ఆ తర్వాత నాలుగు మండలాలు ఉన్న జిల్లాల మంత్రులు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. పథకం అమలుపై విధివిధానాలు ఖరారు చేస్తారు. హుజురాబాద్‌లో ఇప్పటికే దళితుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. తదుపరి కార్యచారణ ఖరారు చేయనున్నారు. అయితే నాలుగు మండలాలు అంటే..మరో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో లబ్దిదారులు ఉంటారు. పైగా రిజర్వుడు నియోజకవర్గాల్లో కాబట్టి లబ్దిదారులు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఈ కారణంగా మరో రెండు నుంచి రెండున్నర వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.