Begin typing your search above and press return to search.

భార్య - భర్త చెరో పార్టీ నుంచి పోటీ!

By:  Tupaki Desk   |   22 March 2019 6:01 AM GMT
భార్య - భర్త చెరో పార్టీ నుంచి పోటీ!
X
దగ్గుబాటి కుటుంబంలో ఇప్పటికే రెండు పార్టీల్లో ఉంది. ఇటీవలే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తనయుడి రాజకీయ భవితవ్యం కోసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గతంలో కూడా వీరు కాంగ్రెస్ పార్టీలో పని చేసి ఉన్న నేపథ్యం ఉండటంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.

ఇక దగ్గుబాడి తండ్రీతనయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా.. దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం భారతీయ జనతా పార్టీ నేతగానే కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఒకే కుటుంబీకులు, అందునా భార్య ఒక పార్టీలో - భర్త- తనయుడు మరో పార్టీలో ఉండటం విశేషమే.

అంతే కాదు.. వీరు రెండు పార్టీల తరఫున పోటీ చేయడం కూడా ఖరారు అయ్యింది. ఇప్పటికే దగ్గుబాటి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఖరారు అయ్యింది. హితేష్ కు ముందుగా ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు జగన్. అయితే.. ఆయన పోటీకి ఏవో కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయని సమాచారం. పౌరసత్వం వివాదం అయ్యే నేపథ్యంలో.. హితేష్ పోటీ నుంచి తప్పుకున్నారు.

దీంతో..దగ్గుబాటి వెంకటేశ్వరరావే ఎమ్మెల్యేగా పోటీకి దిగడం ఖరారు అయ్యింది. ఆ సంగతలా ఉంటే.. భారతీయ జనతా పార్టీ తరఫున దగ్గుబాటి పురందేశ్వరి పోటీకి దిగడం ఖరారు అయ్యింది. విశాఖ నుంచి ఆమె.. పోటీ చేయబోతున్నట్టుగా బీజేపీ ప్రకటించింది.

గతంలో విశాఖ నుంచి పురందేశ్వరి గెలిచిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె విశాఖ నుంచి మరోసారి రంగంలోకి దిగబోతున్నారు. ఇలా భార్యాభర్త.. చెరో పార్టీ తరఫు నుంచి రంగంలోకి దిగడం మాత్రం ఆసక్తిదాయకమైన అంశం అవుతూ ఉంది.