Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పై కుట్రలో బాలయ్య పాత్ర బయటపెట్టిన పురంధేశ్వరి

By:  Tupaki Desk   |   5 March 2017 6:53 AM GMT
ఎన్టీఆర్ పై కుట్రలో బాలయ్య పాత్ర బయటపెట్టిన పురంధేశ్వరి
X
ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని బాలకృష్ణ ఏ ముహూర్తంలో చెప్పారో కానీ అందరూ దానిపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలయ్య సోదరి - మాజీ కేంద్ర మంత్రి - బీజేపీ నేత అయిన పురంధేశ్వరి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసినప్పటి వైస్రాయ్ హోటల్ రాజకీయంలో అందరూ పాత్రధారులేనని.. బాలయ్య కూడా అందులో ఉన్నారని.. అవన్నీ సినిమాలో చూపించాలని అన్నారు.

ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ చూపించాల్సిన బాధ్యత తన తమ్ముడు బాలయ్యపై ఉందని ఆమె అన్నారు. ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమని.. ప్రజలకు అంతా తెలుసు కాబట్టి ఏమీ దాచకుండా చూపించడం మంచిదని సూచించారు. వైస్రాయ్ హోటళ్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కుట్ర జరిగినప్పుడు తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వెళ్లారని.. ఆయన్ను ఆపడానికి తాను ప్రయత్నించినా వినలేదని చెప్పారు. ఈ సినిమాలో అదంతా చూపించినా తనక అభ్యంతరం లేదన్నారు. ఎన్టీఆర్ రెండో పెళ్లి విషయంలోనూ తనకు అభ్యంతరం లేదని.. అది ఎన్టీఆర్ ఇష్ట ప్రకారం జరిగిందని పురంధేశ్వరి చెప్పారు.

వైస్రాయ్ హోటల్ వ్యవహారం రోజున తాను, తన భర్త ఢిల్లీ నుంచి వచ్చామని.. అప్పటికి చంద్రబాబు - బాలయ్య - హరికృష్ణ ఇంట్లో సమావేశమయ్యారని.. అక్కడి నుంచి వారు తన భర్త వెంకటేశ్వరరావును వైస్రాయ్ హోటల్ కు తీసుకెళ్లారని ఆమె చెప్పారు. కాబట్టి అప్పటి కుట్రలో తన భర్త సహా అందరూ బాధ్యులేనన్నారు. అన్నీ ఉన్నది ఉన్నట్లు చూపిస్తే సినిమా చూశాక ఎన్టీఆర్ జీవితంలో విలన్ ఎవరో ప్రజలే అర్థం చేసుకుంటారని ఆమె అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/