Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటి వ‌ర్సెస్ క‌ర‌ణం!..., ప‌ర్చూరు బ‌రి ఇదేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2019 7:59 AM GMT
ద‌గ్గుబాటి వ‌ర్సెస్ క‌ర‌ణం!..., ప‌ర్చూరు బ‌రి ఇదేనా?
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లకు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ... అత్యంత ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ త‌ర‌హా ప‌రిణామాలు పార్టీల అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి మరింత‌గా హాట్ హాట్‌గా మారే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇలాంటి హాట్ హాట్ చ‌ర్చ‌ల‌కు ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం వేదిక కానుంది. ఇక్క‌డి నుంచి వైసీపీ అభ్యర్థిగా ద‌గ్గుబాటి ఫ్యామిలీలో మూడో త‌రం నేత‌గా రానున్నార‌ని భావిస్తున్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, పురందేశ్వ‌రిల త‌న‌యుడు హితేశ్ చెంచురామ్ బ‌రిలోకి దిగుతార‌ని నిన్న‌టిదాకా ప్ర‌చారం జ‌రిగింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. చెంచురామ్ అభ్య‌ర్థిత్వానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని, నేడో, రేపో ద‌గ్గుబాటి జూనియ‌ర్ వైసీపీలో చేర‌నున్నార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల నేప‌థ్యంలో ఏకంగా వైసీపీ ఫ్లెక్సీపై చెంచురామ్ ఫొటోల‌తో పాటు వెంక‌టేశ్వ‌ర‌రావు ఫొటోలు కూడా ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే అనూహ్యంగా చెంచురామ్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోకి దిగేందుకు అంత‌గా ఆసక్తి క‌న‌బ‌ర‌చ‌డం లేద‌ని, తాను అమెరికాలో స్థిప‌డేందుకే ఆస‌క్తి చూపుతున్నార‌ని తాజా వార్త‌లు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చెంచురామ్ అమెరికా పౌర‌స‌త్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

మ‌రి వైసీపీలోకి ద‌గ్గుబాటి ఫ్యామిలీ చేరుతుంద‌న్న వార్త‌ల మాటేమిటి? అన్న చ‌ర్చ‌కు తెర లేవ‌గా... వైసీపీలోకి ద‌గ్గుబాటి ఫ్యామిలీ చేరిక ఖాయ‌మేన‌ని, చెంచురామ్ కాకుంటే... ఏకంగా వెంక‌టేశ్వ‌ర‌రావే బ‌రిలోకి దిగుతార‌ని కొత్త వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీలో ఉన్నా... ఎన్నిక‌ల నాటికి కుటుంబ‌మంతా మాట్లాడుకుని వైసీపీలోకి చేరిపోవ‌డం ఖాయ‌మ‌ని కూడా విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తూ... వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌ర్చూరు బ‌రిలోకి వ‌స్తార‌ని టీడీపీ నేత‌లు కూడా గ‌ట్టిగానే అంచ‌నా వేస్తున్నార‌ట‌. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఈ ప‌రిణామాన్ని ముందుగానే అంచ‌నా వేసి... వెంక‌టేశ్వ‌ర‌రావుకు ధీటైన అభ్య‌ర్థిని కూడా సిద్ధం చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ అభ్య‌ర్థి మ‌రెవ‌రో కాద‌ట‌. టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌కాశం జిల్లాలో బ‌ల‌మైన రాజ‌కీయ వేత్త‌గా ఎదిగిన క‌ర‌ణం బ‌ల‌రామేన‌ట‌. ఇప్ప‌టికే పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న క‌ర‌ణంకు ఈ వార్త‌ను చేర‌వేయ‌డంతో పాటు ప‌ర్చూరులో వెంకటేశ్వ‌ర‌రావును ఢీకొట్టేందుకు సిద్ధం కావాల‌ని కూడా చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశార‌ట‌. తాను అడ‌గ‌కుండానే పార్టీ అధిష్ఠానమే ఈ ఆఫ‌ర్ ప్ర‌తిపాదించ‌డంతో కర‌ణం కూడా ప‌ర్చూరు బ‌రికి సిద్ధ‌మైపోతున్నార‌ట‌.

ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం ద‌గ్గుబాటి కుటుంబానికి పెట్ట‌ని కోట కిందే లెక్క‌. ఇక్క‌డి నుంచి రెండు ప‌ర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వెంక‌టేశ్వ‌ర‌రావు... ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించారు. ప‌ర్చూరు బ‌రిలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ నిలిస్తే... వారిని ఢీకొట్ట‌డం అంత ఈజీ ఏమీ కాదు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ ప్ర‌స్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబ‌శివరావు... వెంక‌టేశ్వ‌ర‌రావును ఢీకొట్టడం సాధ్యం కాద‌ని, క‌ర‌ణం అయితేనే ద‌గ్గుబాటికి స‌రిజోడి అని, అంతేకాకుండా టీడీపీకి గెలుపు అవ‌కాశాలు ఉండాలంటే... క‌ర‌ణం మాత్ర‌మే స‌రిపోతార‌ని కూడా చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని క‌ర‌ణం అభ్య‌ర్థిత్వానికి చంద్ర‌బాబు వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్లుగా వినికిడి. ఇదే జ‌రిగితే... వైసీపీ నుంచి ద‌గ్గుబాటి, టీడీపీ నుంచి క‌ర‌ణం... పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించ‌డం కాయ‌మ‌నే చెప్పాలి.