Begin typing your search above and press return to search.

మాజీ మంత్రుల ఉద్య‌మ బాట‌

By:  Tupaki Desk   |   19 July 2016 12:12 PM IST
మాజీ మంత్రుల ఉద్య‌మ బాట‌
X
రాష్ట్ర రాజకీయాలల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమాల బాట పట్టారు. నిజానికి వీరి రాజ‌కీయ ప్ర‌స్థానం కూడా ఉద్య‌మాల‌తోనే ప్రారంభం కాగా ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌కీయ పున‌రుత్థానం కోసం మ‌రోసారి ఉద్య‌మ బాట ప‌డుతున్నారు. విశాఖకు చెందిన ఈ నేత‌లు గ‌త ప్ర‌భుత్వాల్లో అనేక కీలక పదవులు చేపట్టి ప్ర‌స్తుతం రాజ‌కీయ నిరుద్యోగులుగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కారానికి ఉద్యమ బాట పట్టారు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు... ఒక‌రు దాడి వీర‌భ‌ద్ర‌రావు - మ‌రొక‌రు కొణ‌తాల రామ‌కృష్ణ‌.

టీడీపీ ఆవిర్భావం నుంచి దాడి వీరభద్రరావు ఆ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. చివరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు శాసనమండలి ప్రతిపక్షనేత పదవిని కట్టబెట్టి దాడికి ప్రాధాన్యత ఇచ్చారు. అనంత‌రం దాడి కుమారుడు రత్నాకర్ కు కూడా జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. అయితే 2014 ఎన్నికలకు ఎమ్మేల్సీగా అవకాశం ఇవ్వలేదని దాడి బాబుపై అలకబూని వైసీపీలో చేరిపోయారు. ఆ తరువాత తన కుమారుడు రత్నాకర్ ను విశాఖ పశ్చిమ నియెజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీచేయించినప్పటికి టీడీపీ ప్రభంజనంలో ఓటమి తప్పలేదు. ఆ పార్టీలోకి కొనసాగిన దాడి - రత్నాకర్ తరువాత వేరు వేరు కారణాలుతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికి తిరిగి ఇటీవల కాలంలో దాడి తిరిగి ప్రజా సమస్యలపై దృష్టి సారించడం మొదలు పెట్టారు. ఇటీవల కాలంలో నీటిసమస్యకు సంబంధించి ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఏలేరు నీటిని నగర తాగునీరు అవసరాలకు కేటాయించాలని - స్ధానిక ప్రాజెక్టులు కూడా తక్షణమే పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు ప్రచల్లోకి మరోసారి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక వైఎస్ కేబినేట్ లో ఏకకాలంలో మూడు కీలకమైన విభాగాలకు మంత్రిగా ఉన్న ఘనత కొణతాల రామకృష్టది. కొణతాల చెప్పిందే వేదంగా వైఎస్ ప్రభుత్వంలో జరిగేది. అయితే వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. తరువాత మారిన సమీకరణాలుతో ఆయన అక్కడ ఉండలేక పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు తిరిగి ఉద్యమాల బాట పట్టారు. విశాఖ జిల్లాలోని స‌మ‌స్య‌లు - నీటి పారుద‌ల ప్రాజెక్టుల కోసం గ‌ళం విప్పుతూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ఉద్య‌మాలు మ‌ళ్లీ వీరికి పున‌ర్వైభవం తెస్తాయో లేదంటో రాష్ట్రంలోని ఇత‌ర నేత‌లు బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి - మైసూరారెడ్డి మాదిరిగా నిష్ఫ‌లం అవుతాయో చూడాలి.